7, ఏప్రిల్ 2012, శనివారం

మడీ..తడీ..గోదావరీ..భాషా...సంస్కృతీ...


మన తెలుగు భాష ఎప్పుడైనా మడి కట్టుకుని కూర్చుందా ?
మా చిన్నతనం లో ఎవరింట్లోనయినా శుభకార్యాలకి భోజనాలకి పిలిస్తే భోజనాల సమయానికి మళ్లా వచ్చి వడ్డన లవుతున్నాయి..మడి కట్టుకోండి అని మళ్లీ పిలిచే వారు. అంటే భోజనం చేయడానికి మడి కట్టుకోని వెళ్లాలన్నమాట. అలాంటి సమయాలలోనే కాదు నిత్యం మాయింట్లో మా తాతగారు స్నానంచేసి మడిపంచ కట్టుకోని మా నాయనమ్మ తీసిన గంధం రాసుకుని దాని మీద బొట్టు పెట్టుకున్నాక కాని భోజనానికి కూర్చునే వారు కాదు. మా నాన్నగారూ వారి అన్నదమ్ములూ వగైరా లందరూ పొత్తి పంచలు కట్టుకుంటే మేం పిల్లలందరం  పొత్తిలాగులు తొడుక్కుని భోజనాలకి కూర్చునే వారం. పెద్దవారు పీటలమీద కూర్చుని భోజనం చేస్తే పిల్లలందరం నేలమీదే కూర్చుని విస్తళ్లలో భోజనం చేసే వాళ్లం. భోజనాలయేక ఆకులు తీసి ఎంగిళ్లు ఎత్తి ఆవుపేడతో అలికి శుభ్రం చేసేవారు. అయితే ఈ ఆచారం మా తండ్రుల తరానికే ఆగిపోయింది. ఇంటికి వచ్చాక ఇంట్లో కట్టుకున్న బట్టలతోనే భోజనం చేయడం అలవాటయ్యింది. నేలమీద కూర్చుని బోజనం చేసే వారం కనుక భోజనానంతరం శుధ్ధి చేసే కార్యక్రమంలో మార్పు లేకుండా కొనసాగింది. మా తరం వచ్చే సరికి డైనింగ్ టేబిలు మీద తినడం ప్రారంభమైంది. బయటకు వెళ్లేటప్పుడు వేసుకునే డ్రస్సుతోనే కుర్చీలో కూర్చుని తినడం మొదలైంది. టేబిలు కూడా స్పాంజితో తుడిచి శుభ్రం చేయడమే. మరీ ఈ మధ్య కంచాల్లో అన్నం పెట్టుకుని టీవీ ముందు కూర్చుని తినడం, తిన్నకంచాలను సింకులో వేసేసి చెయ్యి కడిగేసుకోవడం తో సరిపోతోంది. ఈ రోజుల్లో ఎవరింటికి శుభకార్యాలకి వెళ్లినా  బయట తిరిగిన బట్టలతోనే బఫే పధ్ధతిలో ప్లేటుపుచ్చుకుని దానిలో కావలసినది మనమే వేసుకుని తినడం తప్పని సరైంది కదా? మడి కట్టుకుని భోజనం చేయడమన్న ప్రశ్నే లేకుండా పోయింది. మా నాయనమ్మ పొద్దున్నే మడికట్టుకుని వంట ప్రారంభిస్తే మళ్లీ అందరి బోజనాలయేక తాను కూడా మడిగా తినేంత వరకూ మడి పాటించేది. ఈ లోగా ఎప్పుడైనా కాలకృత్యాలకు వెళ్లవలసిన అవసరమొస్తే మళ్లా స్నానం చేసి మడికట్టుకునేది.
ఏది మడి అనే విషయంలో కూడా భిన్నాచారా లున్నాయనిపిస్తోంది. సదా చారపరులైన శ్రీ వైష్ణవుల ఇళ్లల్లో పూర్తి నగ్నంగా ఉండి వంట చేసుకుంటారని విన్నాను. మరి కొందరిళ్లలో తడిబట్టకట్టుకుంటేనే మడి.( మా ఇళ్లలో తద్దినాలు పెట్టినప్పుడు మాత్రం తడి బట్టలతోనే వంటలు చేసే వారు) మరికొందరు ఆచారపరులకి రంగు బట్ట మడికి పనికి రాదట..( ఈ విషయం దాశరధి రంగా చార్య గారి జీవన యానంలో చదివినట్టు గుర్తు. వారింట్లో ఆడవారెవరో  మడిగా ఆరేసిన రంగుచీర కట్టుకుని వడ్డిస్తుంటే వాళ్లఇంటికి  చుట్టంగా వచ్చిన పెద్దావిడ రంగుచీరతో మడేవిటని ఆనాచారమంటూ ఆడిపోసుకుంటుంది.). మరి ఈ నాడు ఏ బ్రాహ్మణుల ఇళ్లల్లో కూడా ఈ మడి ఆచారాలు కొనసాగుతున్నాయని నే ననుకోను.( ఎక్కడో వెయ్యిలో ఒక్కరు కొన్ని కొన్ని సమయాలలో వారికి వీలైన మడి పాటిస్తూ ఉండవచ్చు అది అపవాదమే అవుతుందిగాని సంఘం పాటిస్తున్న సాంప్రదాయం అనిచెప్పలేం.) ఛూసేరా ఎంతలో ఎంత మార్పు?
భోజనాదికాలలోనే కాదు వస్త్ర ధారణ లో కూడా ఎంతో మార్పు వచ్చింది. మా తాతగారు మా నాన్నగారు పంచలే కట్టుకుని మీద చొక్కాతొడుక్కుని ఉత్తరీయం వేసుకునే వారు. అసలు బ్రాహ్మడనేవాడు చొక్కా వేసుకోవడమే అనాచారమట. శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వారి నాన్నగారు తిడతారని చొక్కా తీసుకెళ్లి వీధి చివరకెళ్లాకనే వేసుకునే వారట. మా బాబాయిలూ మేమందరం పంచలేనాడూ కట్టి ఎరగం( ఏదో శాస్త్రవిధులు నిర్వహించినప్పుడు తప్ప). పంచలు కట్టుకోవడం కూడా నేడు చాలా మందికి రాదు. ఆంధ్రుల్లో చాలా కాలం క్రితం స్త్రీలు రవికలే వేసుకునే వారు కారట.ప్రతిష్ఠానపురం (నేటి పైఠాన్) ఆంధ్రుల రాజధాని అయిన తర్వాత తెలుగు వనితలు రవికలు వేసుకోవడం నేర్చుకున్నారట.( ఇప్పటికీ కొంచెంకొన్నాళ్లక్రితంవరకూ చాలా మంది నాయురాళ్లు ఉత్తరాంధ్రప్రాంతంలో రవికలేసుకోకుండా కనపడతారు. చీర కట్టులో కూడా తేడాఉంది. మామూలుగా కుచ్చిళ్లుపోసి కట్టుకుంటే మడికి పనికి రాదు. కాసెపోసి కొంగు వెనక్కిదోపికట్టుకోవాలట.( మావైవు దీనిని అడ్డకట్టుఅనేవారు. మడికావాలంటే ఇలా కట్టుకునే వారు.)
బ్రాహ్మడనేవాడికి క్రాఫింగు పనికిరాదు. ముందువైపు జుట్టు అసలే ఉండరాదు.వెనుకవైపుకొంతజుట్టు పిలకా ఉండితీరాలి. దాశరధి రంగాచార్యగారితండ్రి మరో శ్రీ వైష్ణవుణ్ణి ముందుజుట్టవాడు అంటూ ఆక్షేపిస్తాడు. ఈ రోజుల్లో ఎవరైనా పిలక పెట్టుకుని చొక్కాలేకుండా ఆఫీసులలో పనిచేయగలమా? మన పిల్లలను ఆవిధంగా బడికి పంపగలమా?.
ఇక్కడ ఒక్కవిషయం మననంచేసుకోవలసిఉంటుంది. ఆచారాలు ఏ కాలంలోనూ ఒక్కలాగాలేవు. అనేకానేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ కూడా మన సాంప్రదాయంలోని భాగంగానే గుర్తించాలి. తప్పదు. ఈ సాంప్రదాయంలో మార్పులు రావడమనేది మన ఆంధ్రులకే కాదు.అన్ని సమాజాలలోనూ జరిగింది. మారుమూలనుండే ఆటవిక సమాజాల్లోకూడా ఎంతో మార్పుకనిపిస్తోంది. ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు.

                                                                                   ****
మన ఆదికవి నన్నయగారు రాజమహేంద్రవరతీరాన పవిత్రగోదావరిలో స్నాన మాచరించే భారతాంధ్రీకరణ మొదలెట్టారు. అదే ఏరు ఇప్పుడూ రాజమండ్రి ఒడ్డున పారుతూ ఉంది. దానిని గోదావరి అనే పిలుస్తునే ఉన్నాం.  అయితే అప్పటి నీరుఉందా? క్షణ క్షణం కొత్తనీరు పారుతూనే ఉంటుంది.శతాబ్దాల కాలంలో  గోదావరి ఎంతో కొంత తన ప్రవాహ దిశనీ మార్చుకునే ఉంటుంది. అయినా అది గోదావరే కదా? ఇంకో విషయం. గోదావరిలో అనేక ఉపనదులూ పిల్లకాలువలూ వాగులూ వంకలూ వచ్చిచేరాయి. వీటన్నిటి కలయిక వల్లా గోదావరి పరిపుష్టమై జీవనది అయింది.కానీ దానికి నష్టమేమీ కలుగలేదు.వాటివల్ల గోదావరి కలుషితమైపోయిందనీ మైల పడిపోయిందనీ భావించడం తగదు.మనకెప్పటికీ అది పవిత్రమైన దక్షిణగంగ. గోదావరి గోదావరియే.
                                                                                  ****

మన తెలుగు భాష కూడా జీవనది గోదావరి లాంటిదే. ఎన్నో కొండవాగుల్నీ ,పిల్లకాల్వల్నీ,ఉపనదుల్నీ కలుపుకుని తెలుగు నేలపై నదీమతల్లిగా భాసిస్తున్న గోదావరిలానే. మన తెలుగు కూడా శతాబ్దాలకాలంలో మార్పులూ చేర్పులూ పొందుతూ ఈ నాటి ఈ రూపాన్ని సంతరించుకుని ఉన్నాది. నన్నయ కాలంలోని నీళ్లు గోదావరిలో లేనట్లే ఆనాటి తెలుగు కూడా అదే రూపంలో మనకు లేదు. నన్నయనాటి వ్యావహారిక భాషా స్వరూపం ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ నన్నయగారి భారతాంధ్రీకరణతో మొదలై మన గ్రాంధిక భాష మాత్రం తత్సమ తద్భవాలతో నిండి పోయి తెలుగు దనాన్ని కోల్పోతూ వచ్చింది.తర్వాత శతాబ్దాల తరబడి మన తెలుగు కవులు తమ ప్రబంధాలలో సుదీర్ఘమైన సంస్కృత సమాసాల్ని గుప్పించడమే గొప్పకవిత్వంగా భావించారు. తేలికైన,అందమైన తెలుగు పదాలు మన కావ్యాల్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది ఇలా ఉంటే మన తెలుగు వ్యావహారిక భాషను కూడా సంస్కృతం ముంచెత్తింది. తెలుగు వారైన పండితులూ కవులూ చదువంటే సంస్కృతమే చదువనీ తెలుగు ఎందుకూ పనికి రాని భాష అనీ సభ్య భాష కాదనీ నిరాదరించేరు.తెలుగులో కవిత్వంచెయ్యడం పతనమనిన్నీ అప్రతిష్ఠాకరమనీ భావించేరు. తెలుగు కావ్యాలు చదవడం ఒక చదువు కాదనీ  భావించేవారు. అంతే కాదు తెలుగులో పండితులే కాదు సంస్కృతం రాని వారుకూడా సంస్కృతంలోనే త్వం శుంఠ అంటే త్వం శుంఠ అనో కష్టముష్టింపచా అనో తిట్టుకునేవారు. ఇంట్లో ఆడవారితో మాట్లాడి నప్పుడు కూడా వీలైనన్ని సంస్కృత పదాలు వాడేవారు. నెయ్యి అనేవారు కాదట ఆజ్యం అనే అనేవారు.న పెళ్లి అనకూడదట వివాహం అనే అనాలట. మంచినీళ్లు అంటే పామరుడికింద లెక్క. మంచితీర్థం అంటేనే గౌరవం. ఇలాంటి కొన్ని విషయాలు శ్రీపాదవారు తమ అనుభవాలూ జ్ఞాపకాలూ లో గ్రంధస్థం చేసారు.పండితుల్నీ పెద్దల్నీ చూసి పామర జనంకూడా తమదైన శైలిలో ఆ మాటల్ని వాడుకుంటూ ఉంటారనడానికి ఒకటి రెండు మాటలు మచ్చు చూపిస్తాను.
ఇప్పుడు ఎక్కువ మంది తెలుగువారు మజ్జిగ అని వ్యవహరిస్తున్న దానికి అచ్చతెలుగు పదం చల్ల అనేది ఉంది. ధీనిని మాండలికమని శ్రీ బూదరాజువారు అన్నారుకానీ ఆ భావన సరికాదని నేననుకుంటాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్రలోనే కాకుండా సుదూర ప్రాంతాల్లో కూడా వినిపించిన మాట ఇది. మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణా అనే పాటలోనూ, శ్రీ నాథ కవి వీధిలో.. చల్లాయంబలి త్రావితిన్ అనే చోట్ల కనిపిస్తుంది. ఇదే కాదు ఖమ్మం జిల్లాలో పుట్టిపెరిగి హైదరాబాదులో నివాసం ఏర్పరచుకున్న దాశరథి రంగాచార్యగారూ తన జీవన యానంలో ఈ పదం వాడేరు. రంగుల కల సినిమా తీసిన బి.నరసింగరావు నిజామాబాదు జిల్లాలో తమకున్నగడీలో వారి అమ్మగారు అందరికీ చల్లపోస్తూ ఉండేవారని వ్రాసేరు.ఇంత వైశాల్యంలో వాడుకలో ఉన్న పదం కనుమరుగై దాని స్థానాన్ని మజ్జిగ అనే తద్భవ పదం ( సంస్కృతపదం మార్జిక) ఆక్రమించుకోడానికి కారణం మన తెలుగు వారికి సంస్కృతం పట్లగలదురభిమానమే. శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారి తాతగారు వారి నాయనమ్మగారిని ఏ రోజైనా మజ్జిగ పల్చబడ్డదేం అని అడగడానికి తక్రం ఉదశ్విత్తు అయిందేం అని అడిగే వారట. ఛూడండి ఆ భాషా భేషజం.మన పూర్వులైన పండితులందరికీ తెలుగంటే చిన్న చూపు. సంస్కృతమంటే వల్లమాలిన గౌరవం. అది వారి దృష్టిలో దేవభాషే. ( కన్యాశుల్కంలో భోజనాల సమయంలో గిరీశం నోటంట రెండు ఇంగ్లీషు ముక్కలు వచ్చే సరికి అగ్నిహోత్రావధాన్లు అదేమన్నా దేవభాషా అను విసుక్కుంటాడు.సంస్కృతమైతే దేవభాష కనుక తప్పులేదని మనం ఇందాక చూశాం. సంస్కృతం దేవభాష. గీర్వాణం.  సరస్వతీదేవి గీర్వాణి. ఇప్పుడు ఇంగ్లీషు వస్తే ఎంత గొప్పో అప్పుడు సంస్కృతం వస్తే అంత గొప్ప అన్నమాట. మా చిన్నప్పుడు ఎవరైనా టెక్కుచూపిస్తే వాడికెంత గీర్వాణం అనే వారు. అంటే అది టెక్కుకు పర్యాయపదం అయిపోయిందన్నమాట. మా పిల్లలం కూడా తోటి కుర్రాడెవరైనా టెక్కు చూపిస్తే వాడికి మహా గీర అంటూ ఉండేవారం. ఈ గీర అనే పదం గీర్వాణం నుంచి పుట్టినదే.
ఈ సంస్కృత పదాల వాడుక శిష్టులనుంచి గ్రామీణులలోకి ఎలా వ్యాపించిందో చూపిస్తాను చూడండి:
శ్రీ గంటేడగౌరునాయుడు ఉత్తరాంధ్ర పలుకు బళ్లకి పట్టం కడుతూ వ్రాసిన కళింగోర లో నాయురాలు సోములమ్మఒక కష్టమొచ్చినప్పుడు తనకి అరనశరనాలు ఆడలేదంటుంది. ఇవి అరనశరనాలు కావు. కరచరణాలకొచ్చిన తిప్పలు. సంస్కృతంలోంచి దిగుమతిచేసుకుని  శిష్టులెవరో వాడితే వారినుంచి నేర్చుకున్నది. కాళ్లూ చేతులూ ఆడడం లేదన్నది చక్కని తెలుగు నుడికారం.క్లిష్టసమయాల్లో ఏచేయాలో తోచకపోతే కాళ్లూ చేతులూ ఆడవు. సంస్కృతం తెలుగుని ఎంతలా ముంచెత్తిందో చెప్పడానికి పై విషయాలు చెప్పాను. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.కానీ ఈ వ్యాస ప్రయోజనం అదికాదు. మన తెలుగువారు సంస్కృతాన్ని అవసరానికి మించి దిగుమతిచేసుకుని తెలుగుని సంస్కృ త పదభూయిష్టం చేసారని చెప్పడమే. మన తెలుగు నిఘంటువుల్లో ఎనభై శాతం పైనే సంస్కృత పదాలు అతి తక్కువ తెలుగు పదాలు కనిపిస్తాయి. మన నిఘంటువుల పేర్లే సంస్కృతంలో ఉంటాయి.
సంస్కృతం తర్వాత పార్శీ అరబిక్ ఉర్దూ పదాలు మన భాషలో చాలా చేరాయి.ఈ చేరడం 14వ శతాబ్ది నాటికే జరిగింది. తిక్కన భారతంలోనే త్రాసు (తరాజునుంచి వచ్చినది) కనిపిస్తుంటే అప్పటికి మన వాడుక భాషలో ఎన్ని పదాలు చేరిపోయాయో. ఆ తర్వాత శ్రీ నాథ మహాకవి కూడా యదేఛ్చగా ఈ భాషల పదాల్ని వాడేడు.అంటే అప్పటికే అవి జనసామాన్యం మాట్లాడే భాషలో అంతర్భాగమై పోయాయని మనం గుర్తించాలి. తరువాత ఎందరో తెలుగు కవులు ఉర్దూ పార్శీ పదాల్ని తమ కవిత్వంలో వాడేరు.ఈ భాషల పదాలు కూడా మన తెలుగులో ఎంతలా కలిసి పోయాయంటే అవి తెలుగు పదాలు కావని చాలా మందికి తెలీదు.( ఈ పదాలగురించి మరో సారి వ్రాస్తాను). ఈ భాషల తర్వాత ఆంగ్ల భాషా ప్రభావం ఇతర  భారతీయ భాషల్లాగే మన తెలుగు మీద కూడా పడ్డది. మన ముత్తాతలు సంస్కృతాన్ని కావిలించుకున్నట్టే మన తాతలు తండ్రులు  ఇంగ్లీషుని కావిలించుకుని అక్కర లేని ఆంగ్ల వదాల్ని కూడా దిగుమతి చేసుకున్నారు. వాటికి సమానార్థకాలైన తెలుగు పదాల్ని మరచి పోయేలా చేసారు. ఇదంతా గతం. ఇప్పుడు దానినేమీ చేయలేం. ప్రపంచంలోని ఏ భాషకైనా ఈ స్థితి తప్పదు.
మనం ఇప్పుడు మన భాషని కాపాడుకోవాలంటే మనం మనకు తెలిసిన తెలుగు పదాల్నే వాడుతూ మాట్లాడాలి. పిల్లలచేత మాట్లాడించాలి.
ఎక్కడో మారుమూలనున్న తెలుగు పదాల్ని వెలికితీసి వాటిని వాడుకలోకి తెద్దామనేది సంతోషదాయకమైనదే అయినా వృధా ప్రయాస. అవి జనంలోకి వెళ్లవు.కొత్తగా వచ్చిన పనిముట్లకీ పరికరాలకీ వాటికి వాడుకలో నున్న ఇంగ్లీషు పేర్లనే అజంతం చేసి తెలుగు పేర్లు అని అనుకోవాలి. మనం ఇప్పుడేవో కొత్తపేర్లు సృష్టిస్తే అవి జనంలోకి వెళ్లవు. మొన్న ఉగాది రోజున కవి శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావుగారు సాక్షి ఛానెల్లో తెలుగు కార్యక్రమమేదో నిర్వహిస్తూ కంప్యుటర్ కి తాను అన్నీఅని నామ కరణం చేస్తున్నానన్నారు. ఈ పదం వచ్చే ఉగాదినాటికయినా పదిమందైనా వాడుతారని నాకు నమ్మకం లేదు. కంప్యుటరు అని తెలుగు చేసుకుంటే వచ్చిన నష్టమేమీ లేదు.వందల ఏళ్లుగా మన తాతలుఅంగీకరించి అన్యదేశ్యాలకి కావ్యగౌరవం కూడా కల్పించి ఉండడం చూసికూడా మనం ఇవాళ మడి కట్టుక్కూర్చుంటామంటే అది జరిగే పని కాదని నా నిశ్చితాభిప్రాయం. ఈ పదాలు మన భాషలో చేరడంతో మన భాష ఏమీ మైల పడదు.కొంతమంది ఛాందసంగా మనం సంస్కృతం నుంచి తెచ్చుకోవచ్చుకాని ఇతర మ్లేఛ్చభాషలనుంచి తెచ్చుకోకూడదనే భావన వ్యక్తం చేస్తూ ఉంటారు. వారికి తెలుసునో తెలియదో కానీ మన పండితుల దృష్టిలో  సంస్కృతం వినా మిగిలిన భాష లన్నీ (తెలుగుతో సహా) మ్లేఛ్చ భాషలే.. వీరి ద్విభాషా పరిశుధ్దవాదం (Bilingual Puritanism)  ఏనాడూ ఏ దేశంలోనూ నిలబడలేదు. అందు చేత కొత్తగా వచ్చి చేరుతున్న పరికరాలకి మనం కృత్రిమంగా పేర్లు పెట్టి ఏదో సాధిద్దామనుకోకుండా వాటినలాగే స్వీకరిస్తూనే,మన భాప మౌలిక స్వరూపం చెడిపోకుండా కాపాడుకుంటూ భాషా వ్యాప్తికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.
చెప్పవలసినవీ చెప్పదల్చుకున్నవీ చాలా విషయాలే ఉన్నాఇప్పటికింతటితో ముగిస్తున్నాను. సెలవు.








4, మార్చి 2012, ఆదివారం

దీని భావమేమి తిరుమలేశ?..(.సరదా కబుర్లు)


                            
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగార్ని అన్ని రామాయణాలుండగా మళ్లా  మీరు రామాయణ కల్పవృక్షం వ్రాయడమెందుకని ఎవరో అడిగితే రోజూ తినే అన్నమే కదా అని మానేస్తున్నామా? రోజు కొకరకంగా వండుకుని తింటున్నాము కదా? అలాగే ఇదీను. ఎవరి రుచులు వాళ్లవి కదా అంటూ చక్కని పద్యమొకటి చెప్పారు. అలాగే రామాయణమంటే అమితంగా ఇష్టపడే ముళ్లపూడి వెంకటరమణ దానిని అటు తిప్పీ ఇటుతిప్పీ సినిమా కథలుకూడా తయారు చేసాడు. వాటిల్లో ముత్యాలముగ్గు సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆయన చేసిన అపూర్వ సృష్టి కంట్రాక్టరు రావు గోపాలరావు పాత్ర. మరే సినిమా లోనూ ఇటువంటి పాత్రని చూడం. ఈ పాత్ర చేత రమణ పలికించిన డైలాగులు ఆ రోజుల్లో కేసెట్టుల రూపంలో మార్మ్రోగేవి. ఆ పాత్ర తెరమీద కనిపిస్తూనే చెప్పే డైలాగు అబ్బా సెగెట్రీ... ఎప్పుడూ బిజినెస్సేనా? మనిసన్నాక కసింత కలా పోసనుండాలయ్యా..అంటూ ప్రారంభిస్తాడు.అలాఎవరికైనా మనం చేసే పనిలోంచి అప్పుడప్పుడూ diversion అవసరం. అందుకే మళ్లా ఏ భాషా వ్యాసం తోనో మీముందుకు వచ్చే ముందు సరదా కబుర్లు చెబుదామనిపించింది. ఏం చెబుదామా అనుకునే సరికి  మళ్లా ముళ్లపూడే గుర్తుకి వచ్చేడు. ఓ సారి నేను వైజాగ్ లో ఆటోలో వెళ్తుంటే ముందు వెళ్తున్న ఆటో వెనకాతల చిత్రమైన రాత ఒకటి కనిపించింది.  చాలా వాహనాలకి ముందో వెనకో ఏదో ఒకటి రాసుకోవడం ఒక సరదా. కొంత మందికి ఆచారం కూడాను. Dad’s gift అనో  Mom’s Love అనో కుర్రాళ్లు బైకుల మీద రాసుకుంటే  ఆటోలు లారీల వెనుక చిత్రమైన రాతలు కనిపిస్తాయి.  ఇంగ్లీషులో Touch me not అనో Kiss me not  అనో తెలుగులో పడకు పడకు వెంటపడకు.. అనో  లేకపోతే వాళ్లకిష్టమైన సినిమా పేరో హీరో పేరో రాసుకునే వాళ్లు కొందరైతే, గ్రామ దేవతల పేర్లు రాసుకునే వారు మరి కొందరు.ఇలా ఎన్నెన్నో రకాలు. వాటిమీదే రీసెర్చి చెయ్యవచ్చునన్నంత ఉంటాయి. అందువల్ల ఆవివరాలు పక్కన పెట్టి నాకు కనిపించిన రాతగురించి చెబుతాను. నాముందు వెళ్తున్న ఆటో వెనుక భాగంలో ముళ్లపూడి వెంకట రమణే.. అని వ్రాసుంది.ఇది రమణ గారి వీరాభిమాని అయి అలా వ్రాసుకున్నాడో లేక  ఆ ఆటో ఓనరు లేక డ్రైవరు పేరే అదో నాకు తెలీదు.ఆ ఆసామీ పేరు అదైతే రమణ అని మాత్రం రాసే వాడనీ రమణే.. అని వ్రాయడం చేత అది రచయిత రమణ గురించే అయుంటుందని అనిపించింది. నిజం తెలుసుకునే అవకాశం నాకు లేకపోయింది కానీ, ఆ ఆసామీ రమణ మీది అభిమానంతో అలా రాసుకుని ఉంటే ఆ సంస్కారానికి జోహారనాలనిపించింది. ఇలాటి రాతల్ని ఇంగ్లీషులో గ్రాఫిటీ అంటారుట. దీనికి సరైన తెలుగు పదం నాకు తట్టలేదు. ఈ గ్రాఫిటీ కి సంబంధించిన రెండు ముచ్చట్లు చెప్పి ఈ పోస్టు ముగిస్తాను.
ఏదో దేశంలో ఒక పట్నంలో ఆ వూరి మేయరు గారి కూతుర్ని టాక్సీ నడుపుకునే ఒక యువకుడు ప్రేమించాడట.  ఆ అమ్మాయి పేరు రోజ్. తన ప్రేమకు చిహ్నంగా  Rose is beautiful ( రోజా చాలా అందమైనది)) అని వ్రాసుకున్నాడట. అది చూసి కోపగించుకున్న మేయరుగారు ఒక వారంలోగా ఆ రాత తొలగించాలని హుకుం జారీ చేసేరుట.టాక్సీ తోలుకుంటూ వేరే ఊరికి పోయిన ఆ హీరో వారాంతానికి తిరిగి వచ్చేడు. మేయరు గారి ఆజ్ఞ పాటించాడా లేదా అని అందరూ ఆతృత తో టాక్సీ వెనుక భాగాన్ని చూసేరుట. Rose is beautiful అన్నమాటలు అక్కడ లేవు. కానీ వాటి స్థానంలో  I still feel so.. (నా మనసు మార లేదు) ని రాసి ఉందట. ఊళ్లో అందరికీ దాని భావమేమిటో తెలుసు కానీ మేయరేంచేయగలడు పాపం?
 ఇంకో సంగతి దాదాపు మఫ్పై ఏళ్లనాడు మనకిన్ని టీవీ ఛానెల్స్ రాని రోజుల నాటిది. అప్పుడు దూర దర్శన్ లో ఆదివారం ఉదయం హాస్యకవితా పఠనం ఉండేది. శర్మాజీ అనే కవిగారు  చదివిన చిట్టికవితే ఈ ఉదంతం. ఇన్నేళ్ల తర్వాత ఆ కవిత అచ్చంగా అప్పజెప్పలేను కానీ దాని భావమిది. నా తెలుగులో--
రోడ్డు మీద వాహ్యాళికి వెళ్తున్నానొకసారి
వెనుకనుంచి దూసుకు వస్తోందొక లారి
ఆ మృత్యు శకటాన్ని తప్పించుకో గోరి
పడ్డాను  రోడ్డు పక్క గోతిలో జారి..
దాటిపోయిన లారీ వైపు చూసానొక సారి
దాని వెనుక వైపు రాసుంది అసలు కిరికిరి..
ఇదిగో అది--“మళ్లీ కలుద్దాం ..మరోసారి”.
(లారీ వెనకాతల ఫిర్ మిలేంగే.. అని వ్రాసుందట. దీని భావమేమి తిరుమలేశ?)  రసికుడైన కవి దేనినుంచైనా కవిత్వం పిండగలడు కదా? శర్మాజీ కవిగారికి కృతజ్ఞతలతో..
 మళ్లీ కలుద్దాం... సెలవు.







   

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

మరో మంచి కథ.. ఆత్మీయబంధం కథ....


                                          బంధుత్వాలనేవి మన ప్రమేయం లేకుండానే మన పుట్టుకతోనే ఏర్పడుతాయి. మరికొన్ని మన జీవిత సహచరి లేక సహచరుని ద్వారా ఏర్పడుతాయి. అందువలన ఈ బంధువులనెవ్వరినీ ఆత్మీయ బంధువులని అనలేం. వీరిలో కొంతమందితో మనకి స్నేహబంధం కూడా ఏర్పడి వారు కూడా మనకు ఆత్మీయులౌతారు కాని మిగిలిన వారి విషయంలో ఆత్మీయత ఏర్పడదు. మనతో చదువుకున్నవారిలో, మనతో ఉద్యోగం చేసిన వారిలో కొద్దిమందితో ఆత్మీయత ఏర్పడినా మిగిలిన వారు సహాధ్యాయులుగానూ సహోద్యోగులుగానే మిగిలి పోతారు. అంతే. ఆత్మీయతా బంధం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలీదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలుసుకున్నవారిలో ఆత్మీయ బంధం కలిగిందంటే దానికి మూలాలు ఏ పూర్వ జన్మలో ఉండి ఉంటాయో? మన ఆదివాసీల ఆత్మబంధువు కథవింటే నాకిలాంటి ఆనుమానమే కలిగింది. ఆకథ చెబుతాను వినండి:
                                                                       ***
మనకి సుదూర ప్రాంతమైన ఆస్ట్రియా దేశంలో రాచరిక వంశంలో 1909 లో పుట్టిన హేమండార్ఫ్ రబీంద్రనాథ్ టాగోర్ రచనలు చదివి మనదేశంపై మక్కువ పెంచుకుని  మానవ పరిణామ శాస్త్ర అథ్యయనానికి మన దేశానికి వచ్చి ఈశాన్య భారతంలోని నాగాలనుగురించి పరిశోధనలను జరిపాడు.అలా మన దేశపు ఆదివాసీలతో మొదలైన బంధం ఆయనను నిజాం కాలంలో గిరిజనుల సంక్షేమానికి గాను ఏర్పరచిన ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గం సభ్యునిగా చేసింది. ఈ విధంగా ఆదిలాబాదు ప్రాంతానికి వచ్చిన ఆయన వారితోనే కలిసి జీవిస్తూ వారిజీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. ఈ పనిలో ఆయన జీవన సహచరి బెట్టీకూడా ఆయనతోనే పనిచేస్తూ గిరిజనులకి ఎంతో ప్రీతిపాత్రురాలయ్యింది. చెంచులు,గోండులు, కోయలు,కొండరెడ్ల గురించి విస్తృత పరిశోధన చేసి వారి జీవన విధానం,వివాహ పధ్ధతులు, న్యాయపధ్ధతులు,ఆచార వ్యవహారాలగురించి సాధికారకమైన గ్రంధాల్ని వ్రాసేడు. ఈ విధంగా గ్రంధాల్ని వ్రాయడమే కాకుండా వారి అభ్యున్నతికి కావలసిన కార్యాచరణ ప్రణాళికల్ని రచించి వారి న్యాయమైన పోరాటాలకి సహాయాన్నందిచాడు.
మరో ముఖ్యమై విషయం ఏమిటంటే అనునిత్యం తన అనుభవాలను డైరీలో వ్రాసుకుంటూ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతూ, ఆయా గిరిజన భాషల ప్రత్యేక పదాలను అత్యంత శ్రధ్ధతో నేర్చుకుని ప్రయోగిస్తూ ఉండేవాడు. 1951లోనే లండన్ వెళ్లి పోయినా తరచూ అదిలాబాద్ వచ్చిపోతుండేవాడు. అలా ఆయన అనుబంధం ఆయన జీవితాంతం కొనసాగింది. ఆయనకి ఇక్కడి గిరిజనులతో ఆత్మీయబంధం ఎంతటిదంటే తన కుమారుడు నికొలస్ కు లచ్చూ పటేల్ అని పేరు పెట్టుకున్నాడట. భార్య బెట్టీ ఇక్కడే మరణిస్తే ఆమె కోరికమేరకు అదిలా బాద్ జిల్లా మార్లవాయిగ్రామంలో ఖననం చేసి సమాధి కట్టేరు. హైమండార్ఫ్ కూడా తన  జీవిత కాలంలోనే ఆమె సమాధి ప్రక్కనే తన సమాధి కూడా నిర్మించుకున్నాడు. 1995 లో హైమండార్ఫ్ లండన్ లోమరణిస్తే 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు  మార్లవాయిలో ఆదంపతుల సమాధుల వద్ద గిరిజన సంప్రదాయాలతో కర్మకాండ నిర్వహిస్తున్నారట. ఎక్కడి ఆస్ట్రియా? ఎక్కడి అదిలాబాదు? అర్థ శతాబ్ది క్రిందట లండన్ వెళ్లిపోయి 17 సంవత్సరాల క్రిందట చనిపోయిన విదేశీయునికి ఇప్పుడు సంప్రదాయబధ్ధంగా గిరిజనులు కర్మకాండ నిర్వహించడమేమిటి? ఈ ఆత్మీయతా బంధం ఎలా కలిగి కొనసాగింది? నాకైతే చిత్రంగానే తోస్తుంది.
 హైమండార్ఫ్ గురించి నేటి (26.3.2012) సాక్షి దిన పత్రికలో శ్రీ గుమ్మడి లక్ష్మీనారాయణ గారి వ్యాసం, చాలా కాలం క్రిందటి శ్రీమతి  వకుళాభరణం లలిత గారి గిరిజన విజ్ఞాన సర్వస్వంహైమండార్ఫ్అనే వ్యాసం నాకు పై విషయాలను తెలియజేసాయి. అయితే హైమండార్ఫ్ గిరిజనుల్ని ఎంతగా ప్రేమించాడో వారినెంతగా గౌరవించాడో తెలియజేసే ఒక అపురూపమైన ముచ్చట ఒక్కటి చెప్పి ఈ  వ్యాసం ముగిస్తాను.
                                                                         ****
మన రాష్ట్రంలోని సీనియర్ I.A.S.అధికారి శ్రీ ఫణికుమార్ చాలాకాలం క్రితం అదిలాబాదు జిల్లాలో గిరిజన సంక్షేమ సంస్థ అధికారిగా ఉండేవారు. ఆరోజుల్లో వారు పని చేసే  ఊళ్లో ఒకరోజు సాయంత్రం షికారుగా వెళ్తుంటే ఏకాగ్రతతో వడ్రంగి పని చేసుకుంటున్న ఒక గిరిజన వృధ్దుడు కనిపించాడట. ఆయన పనితనానికి ముగ్ధుడైన ఫణికుమార్ గారు ఆయనను తమ కోసం ఒక అందమైన మేజా బల్ల చేయమని అడిగితే అతడు మౌనంగానే తలూపాడట. తర్వాతెప్పుడో ఆ మేజాబల్ల వారి ఆఫీసుకు చేరింది. తర్వాత కొంత కాలానికి హైమండార్ఫ్ గారు ఆ ప్రాంతానికి వస్తున్నట్లు అధికారిక వర్తమానం అందింది. వారి గొప్పతనాన్ని తెలిసి ఉన్న ఫణికుమార్ గారు వారిని సాదర గౌరవాలతో ఆహ్వానించి మర్యాదలు చేసారట. అప్పుడు హైమండార్ఫ్ గారు తాను అక్కడ కలుసుకోవాలనుకుంటున్న వ్యక్తుల పేర్లలో ఈ వడ్రంగి పని చేసే ఆసామీ పేరు ఉండడం చూసి ఫణి కుమార్ గారు అతడిని పిలిపిస్తానని చెప్పారట. దానికి హైమండార్ఫ్ వెంటనే అది చాలా తప్పనీ  అతడు ఆ గిరిజనులకు రాజనీ తామే వెళ్లి అతడిని చూడాలనీ అన్నాడట. అది విన్న ఫణి కుమార్ గారు అవాక్కైపోయారట. కాలం కలిసిరాక  స్వతంత్ర భారతావనిలో ఆ రాజా సాబ్ వడ్రంగి పని చేసుకోవడం, ఆయనను మేజా బల్ల చేసివ్వమని తను అడిగితే మౌనంగానే ఆయన చేసి ఇవ్వడం, ప్రభుత్వ గౌరవాల్ని అందుకునే హైమండార్ఫ్ గారు ఒక గిరిజనునికి అర్హమైన మర్యాదని పాటించడం చూసి ఫణికుమార్ చాలా సిగ్గు పడ్డారట.( ఈ విషయం స్వతహాగా రచయిత అయిన ఫణి కుమార్ గారు తమ గోదావరి కథల్లో ఒక కథగా మలిచి వ్రాసేరు.)
                                                                      ****
ఈ కథ చదివి మనుషులను వారి వేషాడంబరాలను కాకుండా వారి వారి వ్యక్తిత్వాలను గుర్తించి గౌరవించడమనే సంస్కారం మనలో పెంచుకుంటే మనమూ ధన్యులమే కదా?  సెలవు.
                                                                      ****























                            

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

మడిబట్టకట్టి తెలుగును కాపాడుకోగలమా?


                                       
నా చిన్నతనంలో నేనో కథవిన్నాను. ఓ అమాయిక ఛాందస బ్రాహ్మణ వితంతువు తన పెరట్లోని కొబ్బరి చెట్ల కాయలు దొంగలు కోసుకు పోతుండడాన్ని ఆపడానికి, తన పంచ తడిపి మడిగా కొబ్బరి చెట్ల చుట్టూ కట్టిందట. మడి బట్టనెవ్వరూ ముట్టుకోరని ఆవిధంగా కాయలు దక్కుతాయని ఆశ పడ్డది. కానీ మర్నాడు చూస్తే కొబ్బరికాయలూ లేవు. మడిబట్టా లేదట. దొంగలు కొబ్బరి కాయల్ని మడిబట్టలోమూట కట్టుకుని చక్కా పోయారట. ఏ విషయంలోనూ ఛాందసత్వం సమస్యలకి పరిష్కారం కాదని తెలిపే కథ ఇది.
                                                       ***
 నేడు మాతృభాషా దినోత్సవం. మన తెలుగు వారందరం తెలుగుని పరిరక్షించుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేద్దాం.తెలుగు వచ్చిన వారందరం తెలుగు లోనే మాట్లాడడానికీ వ్రాయడానికీ ప్రయత్నిద్దాం.మన పిల్లలందరికీ విధిగా తెలుగు చదవడం వ్రాయడం నేర్పిద్దాం.వీలయితే తెలుగు సామెతల్ని తెలుసుకుని విరివిగా వాడడానికి ప్రయత్నిద్దాం.ఎందుకంటే ఏ భాషకైనా సామెతలే అందాన్ని చేకూరుస్తాయి. పిల్లలకి సామెతల్ని చెప్పి వాటి అర్థాల్ని వివరించి ఏ సందర్భంలోఎలా వాడాలో తెలియజేయండి. కనీసం మనమైనా వాటిని తరచూ వాడుతుంటే కుతూహలంతో వారే అర్థం తెలుసుకుని వాడుతారు. తెలుగు ఉద్గ్రంధాలుకాదు కానీ తెలుగు కథలైనా వారిచేత చదివింపజేయండి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగార్ల తెలుగువచనం చదివితే తెలుగు తీయందనం తెలుసుకుంటారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విషయంలో ఛాందసత్వం పనికి రాదు.ఎక్కడా ఇంగ్లీషు పదం దొర్లకూడదనే నియమం పెట్టుకోవద్దు. అది జరగని పని. అందరికీ అర్థమై ఇప్పటికే జనబాహుళ్యంలో వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలను పరిహరించి తెలుగు పదాలను సృష్టించి వాడుకలోకి తేవాలనే వృధా ప్రయాస మానుకోవాలి. ఏదేశంలోనూ ఏ కాలం లోనూ ఈ పరిశుధ్ధతా వాదం అసాధ్యంగానే మిగిలింది. నేడు ప్రపంచ భాషగా వెలుగొందుతున్న ఆంగ్ల భాష అనేకమైన లాటిన్, గ్రీక్,ఫ్రెంచి పదాలను తనలో చేర్చుకోవడం వల్లనే సుసంపన్నమైంది. మన తెలుగు కూడా ప్రత్యేకమైన భాషే అయినా సంస్కృతం నుంచి వేలకొలది పదాలను తనలో చేర్చుకుంది. మొదట్లో రాజాశ్రయం కోసమే పండితులూ, కవులూ సంస్కృతాన్ని ఆశ్రయించినా ఆ తరువాత తరువాత తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి  ఎన్నో సంస్కృత పదాలను తెలుగులోకి తీసుకు వచ్చి మన సాహిత్యాన్ని చాలా వరకూ సంస్కృత పదభూయిష్టం చేసారు. దీని వల్ల కొంత మేలు జరిగినా ఎక్కువగా అచ్చ తెలుగు కనుమరుగవడానికి కారణమైంది. కాని దీనినెవరైనా ఆపగలిగారా?.అలాగే ఆ తరువాత కూడా అనేక రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల పార్శీ ఉర్దూ ఆంగ్ల భాషా పదాలు లెక్కకు మిక్కిలి గా తెలుగులో చేరాయి. వీటిలో కొన్ని చాలా కాలం క్రితమే కావ్యగౌరవాన్ని కూడా పొందాయి. ఫలానాది తెలుగు పదం కాదు పార్శీ లేక ఉర్దూ నుంచి మన భాషలో వచ్చి చేరిందని చెబితే జనం ఆశ్చర్యపోయేంతగా అవి తెలుగులో కలిసి పోయాయి (వాటి ముచ్చట మరోసారి చెబుతాను). ఇన్ని వందలూ వేల పదాలు తెలుగులో వచ్చి చేరినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వస్తున్న  ఆంగ్ల పదాలకు మాత్రం ఎందుకు?  రోడ్డు ఫోను రేడియో,టీవీ వంటి పదాలకు తెలుగు పదాలు సృష్టించి వాడడం నిష్ప్రయోజనం. అటువంటిదే హాస్పిటల్ అనే పదానికి అపభ్రంశ రూపమైన ఆసుపత్రి అనేది. ఈ రెండూ కాకుండా వైద్యాలయం అనేపదం ఏ తెలుగు వాడూ ఎప్పుడూ వాడగా నేను విన లేదు. అందు చేత భాషా పరిరక్షణోద్యమంలో ఛాందసత్వం కూదని తెలుసుకుని మసలుకుంటే అసలుకు మోసం రాదని చెప్పడమే నా ధ్యేయం. ఓ రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను:
నేను కాలేజీలో డిగ్రీ చదువుతుండగా (1958-61) మాకు తెలుగు రెండవ పేపరులో వ్యాకరణంతో పాటు ఆంగ్లంనుంచి తెలుగు అనువాదం చేయాల్సిన ప్రశ్న కూడా ఒకటుండేది. ఒకసారి ఆ అనువాదంలో సినిమా అనే పదం వచ్చింది. నా అనువాదంలో దానిని మార్చకుండా సినిమా అనే వ్రాసేను. ఆ పేపరులో నాకు ఫస్టు మార్కు ఇచ్చిన మా  ఆంధ్రోపన్యాసకులు శ్రీ రమణ గారు నన్ను పిలిచి సినిమాకు బదులు చలన చిత్రము అని వ్రాయనందుకు రెండు మార్కులు తగ్గించి నట్లు చెప్పారు. అప్పుడు నేనాయన్ని అయ్యా మీరు ఇంట్లో వాళ్లతో  చలన చిత్రమునకు పోవుదమా అంటారా? లేక సినిమాకు వెళ్దామా అంటారా? అని అడిగాను. దాని ఆయన అది సరేనయ్యా ఇది పరీక్ష కదా? అని అన్నారు. ఆయన చెప్పింది రైటే అయినా యాభై ఏళ్ల తర్వాత ఇవాళ కూడా జనం సినిమాని చలన చిత్రం అని పిలుచుకోవడం లేదుకదా? భేషజాలు మాని ఇటువంటి పదాల్ని తెలుగు వదాలుగా పరిగణిస్తే పోయేదేముంది?
ఆ రోజుల్లోనే  రైల్వేలో పని చేస్తుండే మా బాబాయి ఒకరు చెప్పిన విషయం. రైల్వేలకు సంబంధించి హిందీలో పారి భాషిక పదాల్ని తయారు చేసి ప్రభుత్వం ఇచ్చిన పట్టిక లో రైల్వే సిగ్నల్ కి సూచించిన పదంధూమ్ శకట్ కా ఆవక్ జావక్ సూచక్ యంత్ర్అనిట. ఏం సొగసుగా ఉంది? నాటికీ నేటికీ హిందీ మాట్లాడే ప్రాంతంలో కూడా దానిని సిగ్నల్ అనో దాని అపభ్రంశ రూపమైన సింగల్ అనో అంటారు కానీ  ధూమ్ శకట్ కా... అనే చాంతాడు మాటని ఎవ్వరూ ఉపయోగించరు. (ఇప్పుడైతే ధూమశకటాలే లేవు ఎలక్ట్రికల్ లేక డీసెల్ ఇంజన్లే కాని )
విశాఖ పట్నంలో పోర్టులో సముద్రపు పాయలో పేరుకు పోయే ఇసుకని తవ్వి తీయడానికి డ్రెడ్జర్ వచ్చిన కొత్తలో దానిని అక్కడి పోర్టు కూలీలు తవ్వోడ అని పిలిచేవారట. చాలా చక్కటి మాట. అయినా అదీ జనం వాడుకలో నిలబడకుండా జారిపోయింది. ఏ పదాలు నిలుస్తాయి ఏవి నిలవవు అనేది. వాటి వాడుకలో ఉండే సౌలభ్యాన్ని బట్టి కాలమే నిర్ణయిస్తుంది.
మనం మడి బట్ట కట్టి భాషని కాపాడలేం.
సెలవు.













                                    



                                       




















17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఓ తాత గారి కథ.....(మన కథేనర్రోయ్..)


                             ఓ తాత గారి కథ.....(మన కథేనర్రోయ్..)

నదీమూలం ఋషి మూలం తెలియ రాదన్నారు.ఏం?ఎందుకని?నన్నడగండి చెబుతాను.నేనెన్నోసార్లు రాజమండ్రి దగ్గర అఖండ గోదావరిని చూసి మైమరచి పోయాను.రెండు మైళ్ల వెడల్పున నిండుగా పారుతున్నఆ సుజలస్రవంతి ఎన్నోవేల ఎకరాల భూములకు నీరందిస్తూ ఆంధ్ర దేశాన్నిఅన్నపూర్ణగా మారుస్తోంది కదా అన్నతలంపు కలుగగానే ఆనదిని మన వారు గోదావరీమాత అని ఎందుకు పిలుస్తారో నాణేలు వేసి భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటారో అర్థమై పులకరించిన మనస్సులోనే నమస్కరించుకున్నాను..అదే నేను ఓసారి నాసికా త్రయంబకం వెళ్లడం తటస్థించింది.త్రయంబకం వద్ద గోదావరి పుట్టిన కొండ ప్రాంతానికి వెళ్లినా ఆ కొండమీదకి పోయి గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూసే సమయం లేక పోయింది. అక్కడే కిందనున్న దేవాలయం లో పుష్కరిణి ఒకటుంది. దాని గట్టుగా ఉన్నగోడలో చిన్నశయనిస్తున్న విష్ణు మూర్తి విగ్రహం ఉంది.ఆ మూర్తి పాదాల దగ్గర కొద్ది కొద్దిగా నీరు ఊరుతూ ఉంది.అదే గోదావరి అని అక్కడి పూజారులు చెప్పారు.తరువాత నాసికా క్షేత్రంలో గోదావరిని చూసేను. చిన్నపిల్లకాలువ లాగాను అత్యంత మురికి గానూ ఉంది.ఎవరికైనా అక్కడి గోదావరిని చూస్తే ఓస్... ఇదా గోదావరి అని ఏహ్య భావం కలుగక మానదు. ఇదిగో ఇటువంటి భావాలు మనకి కలుగకుండా ఆ నదీమతల్లి మీద మన గౌరవభావం  ఇసుమంతైనా సడలకుండా అలాగే ఉండాలనే నదీ మూలం వెతుక్కో వద్దన్నారు. అలాగే మన మహా ఋషులుకూడా.వారు మహాజ్ఞాన సంపన్నులై సమాజ శ్రేయస్సు ధ్యేయంగా జీవించిన వారు. వారిలో కొందరి పుట్టుక జనసామాన్యం ఊహించు కునే రీతిలో గొప్పగా ఉండక పోవచ్చు. వారందరూ అగ్ర వర్ణసంజాతులు కారు. అందు వల్ల వారికొచ్చిన నష్టమేమీ లేదు. కాక పోతే ఆ కారణంగా వారికి సామాన్య జనులు ఇవ్వాల్సిన గౌరవం లో లోపం జరుగ వచ్చు.ఇందు చేతనే ఋషుల మూలాలు వెతికే ప్రయత్నం కూడా చేయ వద్దన్నారు. కానీ  ఎవరికి వారు తమ తమ మూలాల్నితెలుసు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తాము ఎక్కడ పుట్టిందీ ఎలా పెరిగిందీ తెలుసుకుని జీవిత పర్యంతం దానిని గుర్తుంచుకోవడం ప్రతి మనిషికీ కనీస ధర్మం. అదే కాక ఎవరికైనా సరే తాను పుట్టిన ప్రదేశాన్ని ఒకసారైనా చూడాలనే కుతూహలం అత్యంత సహజమైనది కదా? ఇదిగో సరిగ్గా ఇలా తమ మూలాలను తెలుసుకోవాలన్న కుతూహలమే అలక్స్ హైలీ అన్న అమెరికన్ నీగ్రో రచయితకు కలిగి, ఆయన చేత పరిశోధన చేయించి తమకు ఏడు తరాలముందు తమ తాతను ఆఫ్రికానుంచి బలవంతంగా బానిసగా అమెరికాకు ఎత్తుకు వచ్చిన సంగతిని అద్భుతమైన చారిత్రాత్మక నవల (The Roots – తెలుగు లో ఏడు తరాలు) గా  వ్రాయించి ప్రపంచ నవలా సాహిత్యంలో మణి దీపంలా వెలిగేలా చేసింది.

 మన మెవ్వరం పుట్టక పూర్వమే, సరిగ్గా ఇలాంటి కుతూహలమే, మన తాతగారికి  కూడా కలిగింది. మన అంటున్నావేమిటయ్యా మనకందరికీ ఒకడే తాతా? అని ఆశ్చర్య పోకండి.అవును. మనందరికీ ఒకడే తాత. ఆయన మన ప్ర,, ప్ర,,ప్ర..( ఎన్ని ప్ర లు వాడాలో నాకు తెలీదు.అంచేత ప్ర to the power of n అని వేసుకోండి) ప్రపితామహుడైన బ్రహ్మ దేవుడు.(తమాషా ఏమిటంటే తాత అంటే కూడా బ్రహ్మ దేవుడే). ఆయనకి తనకి మూలం ఎక్కడో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఆ కథ చెబుతాను వినండి.
                                              *****

      
సృష్ట్యాదికి పూర్వం బ్రహ్మదేవుడు కనులు తెరిచే సరికి తాను పద్మాసనస్థుడై ఉండడం, తన చుట్టూ అనంత వారాశి గోచరిస్తాయి. తానక్కడికి ఎలా వచ్చేడో తెలియదు. ఏం పని చెయ్యాలో తెలీదు. ఎలా చెయ్యాలో తెలీదు. ఎవర్నడగాలో తెలీదు. అడగడానిక్కూడా ఎక్కడా ఒక్క పిట్ట మనిషైనా లేడు.( ఎక్కడినుంచి వస్తాడు సృష్టే ప్రారంభం కాకపోతే? తాతాజీ కనుక తట్టుకున్నాడు కానీ ఎవరికైనా అది పిచ్చెక్కించే సందర్భం కదా?) సరే, తాను పద్మం లోంచి వచ్చాడు కనుక దాని మూలం కనుక్కుంటే సరిపోతుందని ఆ తామర తూడు మొదలెక్కడుందోనని వెతుక్కుంటూ వెళ్తాడు. యోజనాలు పయనించినా దాన్ని కనుక్కో లేక విసిగి వేసారి పోయి మళ్లీ వచ్చి తన స్థానంలో కూర్చుంటాడు. ఏం చేయాలో తోచదు. ఆ సమయంలో ఎక్కడి నుండో రెండు నీటి చుక్కలు జలరాశి మీద పడి తప.. తప.. మని శబ్దం  చేస్తాయి. అది విన్న బ్రహ్మ గారికి ఎవరో తనను తపస్ చేయమని ఉద్బోధించినట్లు తోస్తుంది. వెంటనే తపస్సు ప్రారంభించి వెయ్యి దివ్య సంవత్సరాలు ( అంటే ఎంతని నన్నడక్కండి..ఆ లెక్కలు చాలా కష్టం. .శత కోటి కోట్ల సంవత్స రాలలో ఉంటుందని తెలుసుకుంటే మన కథకి చాలు ) తపస్సు  చేసాడు. అప్పుడు ఆయన ముందర అనంత మైన దివ్య తేజస్సుతో శ్రీ మన్నారాయణ మూర్తి దర్శన మిస్తాడు. ఆ దివ్య మంగళ మూర్తి ఊర్ధ్వ భాగం ఏడు లోకాలు అధో భాగం ఏడు లోకాలుగా పదునాల్గు భువనాలతో విరాజిల్లుతూ ఉంటుంది. భూలోకం కటి ప్రదేశం కాగా ఆ పైన భువర్, సువర్, మహర్, జన తపో, సత్యలోకాలు, కటి ప్రదేశం దిగువున అతల,వితల,సుతల తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు ఉన్నాయి.,.ఆ మూర్తి నాభి లోనుంచి ఉద్భవించిన పద్మమే తన ఆసనంగా బ్రహ్మకు కనిపిస్తుంది. తనకు మూల మెవరో బ్రహ్మకు అర్థమౌతుంది. ఆ తర్వాత శ్రీ మన్నారాయణుడు బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో తెలిపి దానికి కావలసిన శక్తి యుక్తులను ఆయనకు ప్రసాదిస్తాడు.
                                            *****
ఈ విషయాలన్నీ,తానే సృష్టికి మూలకర్త కదా తానెవ్వరిని కొలుస్తాడని అడిగిన తన కుమారుడు నారద మహర్షికి బ్రహ్మ సవివరంగా చెబుతాడు. ఆ నారదుని ద్వారా వ్యాసునికీ తద్వారా లోకానికంతకూ వెల్లడయ్యాయి.
                                                ****
 మన బ్లాగ్ మిత్రుడు శ్రీ రాజ్ కుమార్ గారు అడిగి ఉండక పోతే నేనీ పోస్టు వ్రాసి ఉండే వాణ్ణి కాను. నా చేత ఇది వ్రాయించిన శ్రీ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెలవు. 
                                                  ***













































                                              







11, ఫిబ్రవరి 2012, శనివారం

రెండు మాటలూ...రెండు ఊహలూ...


                            
నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు మానాన్నగారు తరచూ మాఊరినుంచి శ్రీకాకుళం వెళ్ళి వస్తూండేవారు. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా మర్నాడు కమాను వెళ్ళాలి అంటూ ఉండే వారు. తిరిగి వచ్చేక కూడా ఎవరైనా మీరు నిన్న ఊళ్లో లేరా అని అడిగితే కమాను వెళ్లి వచ్చేను అంటూ ఉండేవారు. కమాను వెళ్లడమంటే ప్రయాణమై వెళ్లడమని అప్పుడు నాకర్థమైంది. కానీ తర్వాత ఈ మాట ఎక్కువ మంది నోటంట విని ఉండలేదు. నాకు కొంచెం వయసొచ్చేక, నేను కన్యాశుల్కం చదువుతున్నప్పుడు మళ్ళీ ఈ మాట నా కళ్లబడింది. గిరీశం వెంకటేశాన్ని జామచెట్టెక్కి పళ్లు కోసుకు రమ్మన్నప్పుడు, అగ్నిహోత్రావధాన్లు అదేమిటని అడిగితే అది దొరల విద్యలో ఒక భాగమనీ, పెద్దయ్యాక వెంకటేశానికి గుణుపురం లో తాసీల్దారీ అయితే కమాన్లు వెళ్లాల్సి ఉంటుందనీ, అడవుల్లో ప్రయాణించేటప్పుడు చెట్లక్కడం నేర్చి ఉంటే పనికి వస్తుందనీ అంటాడు. ఎందుకో నాకీ పదం తెలుగు పదంలా అనిపించేది కాదు. నిఘంటువులు చూస్తే సూర్యరాయాంధ్ర నిఘంటువులో కమాను అంటే విల్లు ధనుస్సు అని మాత్రమే ఉంది. శ.ర. నిఘంటువు లో మాత్రం ఇది అన్య దేశ్యమనీ  ప్రయాణము విల్లు అనే అర్థాలున్నాయనీ తెలిసింది. విద్యార్థి కోశమనే నిఘంటువులో మాత్రం విల్లు అనీ ఫిడేలు వాయించు కొడుపు ( ఫిడేలు వాయించు సాధనం) అనీ ఉంది. హిందీ కమాన్ నుంచి వచ్చిన ఈ పదానికి ప్రయాణమనే అర్థం లేదు. మరి ప్రయాణ మనే అర్థమున్న కమాను అనే పదం ఏ అన్యదేశ భాష నుంచి వచ్చి ఉంటుంది? అని ఆలోచిస్తే నా ఊహకి తట్టిన విషయమేమిటంటే దొరల ఏలుబడిలో వారు ప్రయాణం చేయాల్సి  వచ్చినప్పుడు తమ గుమస్తాలనో బంట్రోతులనో వారితో రమ్మనడానికి Come On అటూ ఉండే వారేమో అలా ప్రయాణ మవడాన్ని దొర కమానంటే వెళ్లడం వలన కమానంటే ప్రయాణమని అనుకుని  ప్రయాణానికి అది ఇంగ్లీషు మాటగా వారి మాటల్లో స్థిర పడిఉంటుందనుకుంటాను. లేక పోతే ఏ పరభాషా పదం ఈ అర్థంతో ఉన్నదీ నాకు తట్టలేదు. మరో మంచి వ్యుత్పత్తి దొరికే వరకూ ఈ ఊహ బాగానే ఉంటుందనుకుంటాను.

కన్యాశుల్కం నాటకంలోనే ద్వితీయాంకం ప్రథమ స్థలంలో వెంకటేశం తల్లి, వెంకటేశం రాక కోసం ఎదురు చూస్తున్నప్పుడు, అగ్ని హోత్రావధాన్లు తాను వద్దంటూంటే వెంకమ్మ కొడుకుని ఇంగ్లీషు చదువులో పెట్టిందనీ, ఇంగ్లీషు చదువు తమకు అచ్చిరాదనీ తన పెద్దన్నదిబ్బావధాన్లు కొడుకుని ఇంగ్లీషు చదువుకి పార్వతీపురం పంపించే సరికి వూష్టం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేసిందనీ, బుచ్చబ్బి కొడుక్కి ఇంగిలీషు చెప్పిద్దామనుకుంటుండగానే చచ్చినంత ఖాయిలా చేసిందనీ అన్నప్పుడు వెంకమ్మ మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంటూ వుంటారని అంటుంది. అగ్రహారపు ఛాందస బ్రాహ్మణ స్త్రీ అయిన వెంకమ్మనోటంట ఓఘాయిత్యమనే వినిపించినా ఇది అఘాయిత్యం అనే మాటే. అయితే ఈ అఘాయిత్యం అనే మాట కూడా మన నిఘంటువుల్లో ఎక్కడా కనిపించదు. మొదట్లో ఇది అగత్యం అనే మాట అయి ఉంటుందనీ అగత్యం అంటే గత్యంతరం లేక పోవడం కనుక అలాంటి పరిస్థితుల్లో చేసే పనిని అఘాయిత్యం అంటారనీ అనుకునే వాడిని. కానీ ఈ ఊహ నాకు సంతృప్తి కలిగించ లేదు. తర్వాత ఆలోచించగా తట్టిందేమిటంటే ఇది అఘాయితము అయి ఉంటుందని. అఘము అనే పదానికి పాపము దుఃఖము అనే అర్థాలున్నాయి.ఇతము అనే ప్రత్యయానికి పొందినది కూడుకున్నది అనే అర్థం ఉంది.(నిందితుడు, బాధితుడు వంటి మాటలు చూడండి). పాపము లేక దుఃఖము కలిగినది లేక కూడుకున్నది. అఘాయితము. ఇదే అఘాయిత్యము లేక వెంకమ్మగారు చెప్పిన ఓఘాయిత్తం. ఇంగిలీషు చదువులకి పిల్లల్ని పంపిస్తే చనిపోతారని అగ్నిహోత్రావధాన్లనడం ఓఘయిత్తపు మాటలే కదా మరి?
నా దగ్గర ఏ వ్యుత్పత్తి పదకోశాలూ లేవు. ఈ రెండూ నా ఊహలు మాత్రమే. ఎక్కడైనా ఇంతకంటే సరియైనవీ ప్రామాణికమైనవీ వ్యుత్పత్తులు ఉంటే ఎవరైనా తెలియజేస్తే సంతోషిస్తాను. సెలవు.

4, ఫిబ్రవరి 2012, శనివారం

మాయగాళ్ళకు మాయగాడు....మాయమైన సంవత్సరం


                           
                                      చిన్నతనంలో మన వూళ్లలో చూసే ఉంటారు పాముల్నాడించుకుంటూ చిన్న చిన్న మేజిక్కులు చేసుకుంటూ పాముల మందుల్నీ తావీజుల్ని అమ్ముకునే వారిని. అవి మామూలు మేజిక్కులే అయిఉండవచ్చుగాని వారిలో కొందరికి కనికట్టు విద్యలుంటాయని చెప్పుకునే వారు. పెద్దవూళ్లలో పి.సి.సర్కార్ వంటివారు  మనల్ని సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తే విద్యల్ని ప్రదర్శిస్తారు. మా నాన్నగారు చెప్పారు వారు వయసులో ఉండగా సీనియర్ సర్కార్ చేసిన ఒక మేజిక్ గురించి. అ రోజు ఆయన షో ప్రారంభానికి లేటుగా వచ్చాడట. వస్తూనే చాలా ముందుగా వచ్చినట్టున్నాను మనకింకాటైముంది కదా? అన్నాట్ట. అందరూ గోల పెడితే వాచీలు చూసుకోండి. సరిగా పదీ ఇరవయ్యే అయింది. ఇంకా పది నిమిషాలు టైముంది కదా అన్నాట్ట. అదేం విచిత్రమో కానీ ఏనాడూ ఏరెండు వాచీలు ఒకే టైము చూపక పోయినా అప్పుడు  మాత్రం అందరి చేతి వాచీలు పదీ ఇరవయ్యే చూపించాయట. మిగిలిన మేజిక్కుల సంగతేమో కానీ ఇలాంటివి కనికట్టు విద్యలుంటేనే సాధ్యమౌతాయి కాదా?.ఈమధ్య టీవీలో చాలా మేజిక్కులు ఎలా చేస్తారో చూడడం జరిగింది. అవి చూసేక ఓస్ ఇంతేనా అనిపించినా కొన్ని మాత్రం ఇంకా మనకి వింతగానే ఉంటాయి. కదిలే ట్రైన్ని  విమానాన్ని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా మాయం చేసే వారున్నారు. ఇతర దేశాల సంగతి ఇప్పుడు మనకొద్దు గానీ మన దేశం ఇటువంటి మాయలకీ మంత్రాలకీ పుట్టినిల్లని పిస్తుంది. మేజిక్కుల గురించి చెప్పుకున్నప్పుడు  The Great Indian Rope Trick  గురించి చెప్పుకు తీరాలి.. ఇందులో ఐంద్రజాలికుడు ఒక మందమైన తాడు తీసుకుని దాని చివరని గాలిలోకి విసురుతాడు. అప్పుడది ఒక స్తంభం మాదిరిగా నిటారుగా నిల్చుంటే ఆయన సహాయకుడు దాన్ని పట్టుకుని పాకుకుంటూ చివరి వరకూ వెళ్లి మాయమై పోతాడు. కొద్ది సేపటికి హాహాకారాలు వినిపిస్తూ నేలమీదికి రక్తం కారుతుందట. చూపరులందరూ నిశ్చేష్టులై ఉండిపోతే ఆ సహాయకుడు  ఏమీ జరగనట్టుగా కిందకి దిగి వస్తాడట. ఎటువంటి Technical Support లేకుండా ఇటువంటి ప్రదర్శన ఎలా సాధ్యమో తెలియదు. కనికట్టు అనే విద్య ఏమైనా ఉందేమోఏది ఏమైనా ఇటువంటి విద్యలకి పుట్టినిల్లయిన మనదేశం లోనే చాలా కాలం కిందటే మాయగాళ్లకి మాయగాడైన మహనీయుడొకడు పుట్టేడు. ఆ వివరాలేమిటో  తెలుసుకుందాం..
                                                   ***
 మనం భాగవత కథలు విన్నప్పుడు శ్రీ కృష్ణుని లీలలు చాలా విన్నాము కదా?  ఆ కృష్ణుడు తాను నెలల బాలుడిగా ఉన్నప్పుడే తనని చంపడానికి కంసుని చే పంప బడ్డ పూతన  తన స్తన్యం ద్వారా విషమివ్వబోతే ఆమె  చనుబాలతో పాటు ఆమె రుధిరాన్ని కూడా త్రాగి ఆమె ప్రాణాల్నితోడేసి ఆమెని చంపి వేసిన వైనం మనకు తెలుసు. అలాగే తృణావర్తుడ్నీ వత్సాసుర బకాసురుల్నీ కూడా సంహరిస్తాడు. ఇవన్నీ ఆయనకి ఐదేళ్లు కూడా నిండకుండానే ( కౌమారంలోనే) జరిగాయి. తన ఐదవ ఏట, ఒక రోజు తన సంగడీ (స్నేహితు)లతో కలసి చల్దులున్న చిక్కాలను పట్టుకుని లేగ దూడల్ని మేపడానికి అడవికి వెళ్తాడు. వారు ఆలా వెళ్తుండగా దారిలో కంసుని పంపున అఘాసురుడనే రాక్షసుడు కొన్ని యోజనాల పొడవున్న పెద్దపాము రూపంలో భయంకరంగా దారికడ్డంగా పడుక్కుని నోట్లోంచి మంటలు కక్కుతుంటాడు. అయితే బాలకృష్ణుడు  పక్కనుండగా భయమనే మాటే తెలియని గోపబాలురు దాన్ని దాటి వెళ్లడానికే సిధ్ధపడతారు. అది ఒక్కసారిగా వారినీ లేగ దూడల్నీ కబళిస్తుంది. కానీ ఆది నోరు మూసుకునే లోపే బాలకృష్ణుడు దాని నోట్లో ప్రవేశించి ఒక్కసారిగా పెరుగుతాడు. అప్పుడా పాము ఊపిరాడక చనిపోతే తన మిత్రులందర్నీ  తీసుకుని బయటికి వస్తాడు. ఈ దృశ్యాన్ని గమనించిన దేవతలు హర్షధ్వానాలు చేస్తారు .
 తర్వాత ఒక చోట దూడల్ని పచ్చిక మేయడానికి వదలి,  ఒక కొలని గట్టున బాలకృష్ణుడు మధ్యలో కూర్చుండగా చుట్టూ కూర్చొని చల్దులు తినడం ఆరంభిస్తారు. ఉరుకులూ పరుగులూ లేని జీవితం కాబట్టి ఆడుకుంటూ పాడుకుంటూ మెల్లమెల్లగా తింటుంటారు. అప్పుడు బాలకృష్ణుడు లేగదూడలు మేత మేసుకుంటూ దూరంగా పోవడం గమనించి తన మిత్రుల్ని తింటూ ఉండమని తాను లేగల్ని వెతికి తీసుకు వస్తానని బయల్దేరతాడు. ఆ సమయంలో భూమి మీదకి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఈ బాలుడు చాలా చిన్నవాడు కదా అంత పెద్ద అఘాసురుణ్ణి ఎలా  చంపగలిగి ఉంటాడని ఆశ్చర్యపోతూ ఆ బాలుని శక్తి పరీక్షిద్దామనుకొని లేగదూడల్నీ గోపబాలుర్నీ ఒక మాయాగుహలో దాచిపెడతాడు. లేగల్ని వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణుడు వాటి అడుగుల గుర్తులు చూసుకుంటూ ఇటు వెళ్లాయని ఇక్కడ మందగా నిలిచాయని అనుకుంటూ చాలాదూరం వెళ్లాడు.  దూడలు కని పించక తిరిగి వచ్చేసరికి చల్దులు తింటూ ఉండాల్సిన తన సంగడీలు కూడా కని పించలేదు. ఆయన సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అవతారం కనుక అది బ్రహ్మదేవుడి మాయ అని గ్రహిస్తాడు. బ్రహ్మమాయని తొలగించేయడం తనకి చాలా తేలికైన పని అయినా ఆ లీలా పురుషుడు బ్రహ్మకే బుధ్ధి రావాలని ఊరుకుంటాడు. కానీ ఇంటికి వెళ్లగానే గోపబాలుర సంగతీ లేగదూడల సంగతీ అందరూ అడుగుతారని తానే వారందరి రూపాలూ కూడా ధరించి ఇంటికి మరలుతాడు. ఇళ్లదగ్గర పిల్లల్ని చూసిన తల్లులూ లేగల్ని చూసిన గోమాతలూ వారి వారి సంతానమే అనుకుని ఎప్పటిలాగే ఆప్యాయంగా చూసుకుని మురిసి పోతారు. ఈ విధంగా కృష్ణుడు ఇందరి రూపాలలో అందరికీ ఆనందం కలిగిస్తూ సుమారు ఒక సంవత్సరం పాటు గడుపుతాడు. సంవత్సరం కాలం ఇంక ఐదారు రోజులలో ముగుస్తుందనగా బ్రహ్మదేవుడు ( ఆయనకది ఒక తృటి కాలం)  ఏ మయిందో చూద్దామని వస్తాడు. మహాశ్చర్యకరంగా తను మాయాగుహలో దాచి ఉంచిన గోపబాలురూ లేగదూడలూ అక్కడే ఉండగా ఇక్కడ కృష్ణుని చుట్టూచేరి వారంతా ఆనందంగా ఉండడం కనిపిస్తుంది. తన మాయని మించిన మాయ ఏమిటో తెలియక విస్తుపోతాడు. అప్పుడు కృష్ణుడు  తన మాయని సడలించగా బ్రహ్మదేవునికి గోపబాలురందరూ హార కుండల కిరీటాలూ వైజయంతీ వనమాలికలు ధరించిన మేఘ శ్యామల మూర్తులుగా కనిపించారు. వారి తేజస్సు బ్రహ్మకు భరింపనలవి కాకుండా పోయింది. అప్పుడు  ఈ శ్రీకృష్ణుడు తనను కన్న తండ్రియైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని తెలిసికొని, పశ్చాత్తప్తుడై ఆయన కాళ్లమీద పడి చాలా సేపు స్తోత్రం చేస్తాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు బ్రహ్మను క్షమించి,  తాను సృష్టించిన మాయా రూపాల్ని తనలోనే కలిపేసుకుంటాడు.  బ్రహ్మ తన మాయాగుహలో దాచిన గోపబాలురనూ లేగలనూ తిరిగి యథా స్థానాల్లో ఉండేట్లు చేస్తాడు.  కొలని ఒడ్డున చల్దులు పట్టుకుని కూర్చున్న గోప బాలురు  కృష్ణుణ్ణి చూసి చెలికాడా వచ్చేవా, రా, మన లేగలన్నీ అరణ్యంలోంచి తిరిగి వచ్చేసాయి. నీవు లేవని మేమెవ్వరమూ చల్దులు తినలేదు. కలిసి తిందాము, రావయ్యా అని పిలుస్తారు. వారందరూ కలిసి చల్దులు తిన్న తర్వాత చనిపోయిన కొండచిలువ రూపంలో ఉన్న అఘాసురుడి శరీరాన్ని చూసి ఇళ్లకు వెళ్లాక తమవారికి శ్రీకృష్ణుడు కొండచిలువను చంపి  తమను రక్షించిన వైనాన్ని తెలుపుతారు.                                           శ్రీ కృష్ణుడు అఘాసురుణ్ణి చంపింది తన ఐదవ ఏటనే అయినా, గోపబాలురందరూ ఇళ్లకు రాగానే  అది అప్పుడే జరిగిన సంఘటనగా తమవారికి చెప్పడం వలన, అప్పటికి శ్రీ కృష్ణునికి ఆరేళ్ల (పౌగండ) ప్రాయం కనుక అతడు అఘాసురుణ్ణి ఆరేళ్ల ప్రాయంలో చంపేడనే అందరూ అనుకుంటారు. ఆవిధంగా ఆ గోప బాలుర జీవితాల్లో ఒక సంవత్సర కాలం మాయమయ్యింది. సృష్టికర్తయైన బ్రహ్మదేవుడికి దిమ్మతిరిగేలా చేసిన మాయగాళ్లకు మాయగాడి కథ ఇది.
                                                        ***
చదివారుగా. విష్ణుమూర్తికి మాయ పుట్టినిల్లట. ఆయన అవతారమైన శ్రీ కృష్ణుడు మనదేశంలో పుట్టాడు. మరి మనకి మాయలకి కొదవేమిటి?  కాకపోతే ఈ కలియుగ కృష్ణుల మాయలకి ప్రజల సొమ్ములూ, గవర్నమెంటు వారి ఆస్తులూ మాయం అవుతున్నాయి. అంతే తేడా.
                                             ***
P.S.—భాగవతంలో ఈ కథ చదివిన వారికీ, విన్నవారికీ వారి సమస్త కోరికలూ తీరుతాయని వ్రాసి ఉంది.
అందుచేత ఈ పోస్టు చదవడం మీ అదృష్టం గా భావించండి. సెలవు.
                                                           ***