23, ఏప్రిల్ 2013, మంగళవారం

మా ఆవిడ బంగారం...


                         
మా ఆవిడ బంగారం అని నేననగానే అది మీకు రెండు విధాల అర్థమయ్యే అవకాశం ఉంది.మొదటిది నేను మా ఆవిడను బంగారం లాంటి మనిషని మెచ్చుకుంటున్నానని, రెండవది మా ఆవిడకు చెందిన బంగారమనీ.ఇటువంటి విషయాల్లో స్పష్టత కోసమే మన వాళ్లు రెండో అర్థం వచ్చేటట్లు చెప్పాల్సివచ్చినప్పుడు మా ఆవిడ యొక్క బంగారం అని  విభక్తి ప్రత్యయం చేర్చి చెప్పాలనే వారు. ఈ యొక్క అనే విభక్తి ప్రత్యయాన్ని మన వాళ్లు పాత రోజులలో చాలా ధారాళంగా వాడేవారు.ఇది నాయొక్క పుస్తకము, ఈవిడ నా యొక్క భార్య అన్నట్లు.వక్తలూ, రాజకీయవేత్తలూ అయితే మరీని. అవసరం ఉన్నా లేక పోయినా ఆ యొక్క ఈ యొక్క అంటూ మాట్లాడే వారు.ఇప్పుడీ యొక్క అనేది  మాటల్లోనే కాదు వ్రాతల్లోనూ దాదాపు మాయమయి పోయింది. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడమే.. సరే. అదలా ఉంచండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మా ఆవిడ యొక్క ( ఒకప్పుడుండీ ఇప్పుడులేని ) బంగారం కథ.ఇది చదివేక  మా ఆవిడ బంగారమో కాదో మీరే చెబుదురు గాని.
దాదాపు 40 ఏళ్ళ క్రిందట, సరిగా చెప్పాలంటే 1970 లో నేను రెండు నెలలు సెలవు పెట్టాను. ఆ సెలవు నేను  ఇప్పటి శ్రీ రాం సాగర్ (అప్పట్లో దానిని పొచంపాడు ప్రోజెక్టు అనే వారు) లో పని చేస్తుండగా తీసుకోవడం వల్ల ఆ సెలవు జీతం రెండు నెలలకు 1200 రూపాయలు నాకు కొంచెం ఆలస్యంగా అందేయి. ఆ సెలవు కాలంలో ఇంట్లో ఉండే సేవింగ్స్ తోనే పొదుపుగా గడపడం వల్ల ఈ 1200 రూపాయలూ బోనస్ గా వచ్చినట్లనిపింది. అప్పుడు వాటిని పుట్టింటి కెళ్ళిన మా శ్రీమతికి నీ యిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అంటూ పంపించాను. ఆడబ్బులు పెట్టి అప్పుడు ఆవిడ నాలుగు తులాలు బరువుతూగే నాలుగు పేటల చంద్రహారం ఒకటిన్నీ ఒక జత గాజులూ కొనుక్కుంది.గాజులు నిత్యం వేసుకున్నా చంద్రహారం మట్టుకు పెళ్ళిళ్ళకూ పేరంటాలకూ వెళ్ళి నప్పుడు మాత్రం వేసుకునేది.ఇలా ఉంటే ఆరోజుల్లో కొన్నాళ్లు హైదరాబాదులో దొంగల భయం ఎక్కువగా ఉండేది. సివారు ప్రాంతాల్లోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న కాలనీలలో కూడా రాత్రుళ్లు కాలనీ వాసులు గస్తీ తిరిగే వారు.మా కోలనీలో కూడా అలాగే కొన్నాళ్లు గస్తీ తిరిగే వాళ్ళలో నా వంతు వచ్చినప్పుడు నేనూ నిద్ర మానుకుని తిరిగే వాడిని. ఇంట్లో కొంచెమైనా బంగారం ఉండబట్టి కదా భయపడడం. లేకపోతే ఎంత మనశ్శాంతితో జనం జీవించగలరో కదా అనుకునే వాడిని. బంగారం మంచి పెట్టుబడి (investment ) అన్న అభిప్రాయం నాకెప్పుడూ లేదు.అందుకనే చంద్రహారం అమ్మేస్తే మంచిదనే ఆలోచన నాకు కలిగింది. మా ఆవిడ కూడా రెండో ఆలోచన లేకుండా అమ్మి పారేయండి అంది. ఆ విధంగా  1980లోఆ నాలుగు పేటల చంద్రహారాన్ని అమ్మేసాను.గ్రాముకు 125 చొప్పున 44 గ్రాముల చంద్రహారానికి 5500 రూపాయలు వచ్చేయి.( ఆ తూకం బిల్లు రశీదు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి). ఇంట్లో ఏ బంగారమూ లేక పోవడం వల్ల నిశ్చింతగా నిద్ర పోతూ హాయిగా ఉండేవాళ్ళం.ఆ తర్వాత ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో వారికి ఏదో ఒకటి కొనడం తప్ప తన కోసం మాత్రం ఎప్పుడూ మా ఆవిడ బంగారం నగలు చేయించుకోలేదు.( నేను రిటైరయ్యాక ఒకటి రెండు జతల గాజుల చేయించుకుందేమో అంతే.) ఎప్పుడైనా ఏ పెళ్ళళ్లలోనో ఫంక్షన్లలోనో మా ఆవిడ మెడలో  పుస్తెలతాడు తప్ప ఏమీ లేకపోవడం చూసి చంద్రహారం ఉండాలిగా వేసుకోలేదేం అడిగిన వారికి మా ఆవిడ సమాధానం చిరునవ్వే అయ్యేది. 
                                                     ****
ఇంతకు ముందెన్నడూ లేనంతగా గడచిన దశాబ్ద కాలంలో పసిడి ధర తారాజువ్వలా ఎగసి తులం (10గ్రాములు) 32,000 తాకినప్పుడు కూడా మా ఆవిడ కాని నేను కాని అయ్యో చాలా చవగ్గా తులం 1250 కే అమ్మేసామే అని బాధ పడలేదు.గడచిన వారంలో బంగారం ధరలు పడిపోయి తులం 26000 కి దిగివచ్చి నప్పుడు  జనం బంగారం షాపుల ముందర క్యూలు కట్టిమరీ బంగారం కొనుక్కోవడం చూస్తే నవ్వుకునే వాళ్ళం. మొన్ననిలాగే క్యూలో నిలబడి  బంగారం వస్తువేదో కొనుక్కొచ్చి మా ఆవిడకు చూపించి అక్కయ్యగారూ మీరూ గొలుసేదైనా కొనేసుకోండి  మళ్లా ధర పెరిగి పోతుందేమో అని ఉచిత సలహా ఇచ్చి వెళ్తున్న మిత్రురాలికి అలాగే లెండి అంటూ సమాధానమిస్తూ నా వేపొక సారి చూసి చిరునవ్వు నవ్వింది మా ఆవిడ.
                                                      ****
ఇలా మేమిద్దరం నవ్వుకోవడానికి కారణం లేక పోలేదు. ఎందు చేతనంటే 1980లో మేము చంద్ర హారాన్ని అమ్మగా వచ్చిన 5500 రూపాయలలో 5000 రూపాయలు (40 గ్రాముల ధర) పెట్టి పోస్టాఫీసులో సేవింగ్సు సర్టిఫికెట్లు కొన్నాము.అవి 6 ఏళ్ళలో 1986 నాటికి 10,000 అయేయి.అవి అలా Reinvest  చేస్తూ పోతే 2010 నాటికి అవి 1,28,000 అయేయి. అవి మళ్లా Invest చేసాము.అవి 2016 నాటికి 2 లక్షల పై చిలుకు అవుతాయి. అప్పుడు బంగారం 10 గ్రాముల ధర 50,000 రూపాయలున్నా మాకు బాధలేదు. ఈ రోజైనా మా సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ 160000 ఉంటుంది.అవి Encash చేసుకుని  మా ఆవిడ చంద్రహారం కొనుక్కున్నా ఇంకా నాకో 50000 మిగిలినట్లే కదా? అంచేత మా ఆవిడ చంద్రహారం ఎక్కడికీ పోలేదు. మా పోస్టాఫీసులో భద్రంగా ఉంది. మేము కంటినిండా నిద్ర పోతున్నాము.అమాయకులైన ఆడవాళ్ళు మాత్రం చంద్రహారం అమ్మేసుకున్న మా ఆవిడ మీద జాలి చూపులు ప్రసరిస్తూనే ఉన్నారు.
                                                        ****
మా ఆవిడ మెళ్ళో ఏ నగా లేక పోవడం చూసి  ప్రక్కకు తిరిగి నవ్వుకునే ఆడవాళ్ళకు చిరు నవ్వే సమాధానం ఇచ్చే మా ఆవిడ నిజంగా బంగారమే. కాదంటారా?
                                                                             ****
                   

11, ఏప్రిల్ 2013, గురువారం

జారి పోయిన వింత అక్షరం కథ...






ఆ మధ్య డిశంబరు లో నేను వ్రాసిన ఎవరీ బుడతకీచులు అనే పోస్టులో పోర్చుగీసు వారు మన దేశంలో మొదటగా పశ్చిమ సముద్ర తీరం లోని కోజి కోడ్ లో మొదటగా కాలూనేరని వ్రాసేను. అది చదివిన మన అజ్ఞాత బ్లాగ్మిత్రుడొకరు దానిని కోజి కోడ్ అని కాదని కోళి కోడ్ అని వ్రాయాలని మళయాళీయులు అలాగే పలుకుతారని సూచించారు. దానికి నేను మళయాళీయులు దానిని ఉచ్చరించే విధంగా వ్రాయడానికి మన తెలుగు లిపి లో సరైన అక్షరం లేదనీ, ఇంగ్లీషులో దానిని KoZhikode అని వ్రాసినట్లే మన తెలుగు వారు కూడా కోజి కోడ్ అని వ్రాస్తున్నారని, కీ.శే. శ్రీ తూమాటి దొణప్ప గారు కూడా అలాగే వ్రాసేరని, నేను అదే అనుసరించాననీ వివరించాను. తమిళంలో కూడా ఇలాంటి ఉచ్చారణ కలిగిన శబ్దాన్ని మన వాళ్లు తెలుగులో జ అనే అక్షరంతోనే సూచిస్తున్నారు. నిజానికి తమిళ భాష లోని కజగం చెజియన్ అనే పదాలు వారు ఉచ్చరించే రీతిలో వ్రాయడానికి మనకి సరైన అక్షరం లేదు. అది ళ కాదు ఝ కాదు డ కాదు. ఆ ధ్వని వింత గా ఉంటుంది. అందు కనే కాబోలు సరదాగా మన ఆరుద్ర గారు

తమల పాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు ఓ కూనలమ్మా అన్నారు.
నోటినిండా తాంబూలం వేసుకుని నములుతూ మాట్లాడితే మన తెలుగైనా తమిళం లాగే వినిపిస్తుంది మరి. సరే, వాళ్ల భాష వాళ్లకిష్టమొచ్చిన రీతిలో మాట్లాడుకుంటారు కాదనడానికి మనమెవరం? కానీ ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మన తెలుగున్నూ, సోదర భాషలైన తమిళం, మళయాళం, కన్నడం కూడా ఒకే కుదురులోని మూల ద్రావిడ భాష నుంచి పుట్టినప్పుడు, ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం మళయాళ తమిళ భాషల్లో ఆ భాషలు పూర్తిగా వేరయిన తర్వాత వచ్చి చేరిందా? లేక మూల ద్రావిడ భాష నుంచే ఆ భాషల్లోకి వచ్చి చేరి నేటికీ నిలచి ఉందా? అలా వచ్చి ఉంటే మన తెలుగు లోకి రాకుండా ఉండి ఉంటుందా? వచ్చి ఉంటే ఇప్పుడదేమయ్యింది? వచ్చిందండీ వచ్చింది. మన తెలుగు లోకీ వచ్చింది. దాని కథే నేనిప్పుడు చెప్పబోయేది.
తమిళ మళయాళ భాషల్లో ఉన్న ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం ఆ భాషల్లాగే మన తెలుగు లోకీ, మన సోదర భాష అయిన కన్నడం లోకీ కూడా వచ్చి చేరింది. ప్రాచీన కన్నడంలో ఉండి తరువాత ఆభాషలో మాయమైంది. అలాగే మన తెలుగులో కూడా దాదాపు నన్నయ గారి కాలం వరకూ ఉండి ఆ తర్వాత పూర్తిగా మాయమైంది. నన్నయకు పూర్వపు శిలా శాసనాల్లోనూ, నన్నయ తర్వాత కాలంలో కొన్ని శిలా శాసనాల్లోనూ ఇది మధ్య లో గీత లేని మన బండిరా “ ఱ ” రూపంలో కనిపిస్తోంది. ఇది ఏ విధంగా ఉచ్చరించే వారో తెలుసు కోవడానికి అప్పటి ఉచ్చారణ రికార్డు లేదు కానీ అది కనిపించిన పదాలను బట్టి వాటిని నేడు మనం ఉచ్చరిస్తున్న తీరును బట్టి ఊహించుకోవచ్చు.ఆ అక్షరం స్థానంలో నేడు వివిధ పదాల్లో డ,ద,ళ,ల,ర,ఱ లు వచ్చి చేరాయి కనుక ఈ శబ్దాల మధ్యలో ఏదో ధ్వనితో ఉచ్చరించే వారని ఊహించ వచ్చు.

డా. కాల్డ్వెల్ మహాశయుడు దీనిని ఇంగ్లీషులోని rzh అనే అక్షరాలు కలిపి పలికితే వచ్చే ధ్వనిగా ఉచ్చరించేవారని అన్నాడు. కన్నడ భాషలో ఇప్పుడు లేక పోయినా పాత కన్నడంలో ఉన్న ఈ అక్షరాన్ని వారు “రళ ” మని అంటారుట. తెలుగులో ఇది వెయ్యేళ్లకు పూర్వమే అంతరించి పోవడం వల్ల మన వైయాకరణులు దీనికే పేరూ పెట్టకుండా వింత అక్షరమని మాత్రం వ్యవహరిస్తూ వస్తున్నారు. పూర్వం ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఱెందులూరే నేటి మన దెందులూరు. కోఱి..అన్నదే కోడి గా మారింది. చోఱ అన్నది చోళగా మారింది. ఆ విధంగా ఆ వింత అక్షరం నన్నయనాటికే డ,ద,ళ,ల,ర,ఱ లలో ఏదో ఒక ధ్వనిగా మారి స్థిర పడుతూ వచ్చింది.నన్నయ తన భారతంలో ఈ అక్షరాన్ని ఉపయోగించక పోవడం వలన, ఆ తరువాత కొద్ది శిలా శాసనాల్లో మాత్రమే ఇది కనిపించడాన్నిబట్టి చూస్తే, ఇది కనీసం ఏ ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల క్రిందటే మన వర్ణ మాల నుంచి జారి పోయిందని తెలుస్తోంది.అదీ ఈ వింత అక్షరం కథ. ఇలాగే కాలగమనంలో మన వర్ణమాలనుంచి జారి పోయిన, పోతున్న మరికొన్ని అక్షరాల గురించి మరోసారి ముచ్చటించుకుందాం.


బ్లాగ్మిత్రులందరికీ విజయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలతో —సెలవు. విజయ ఉగాది.11.4.13.


1, ఏప్రిల్ 2013, సోమవారం

అరనవ్వులాంటి అర సున్న కథ...




అరనవ్వులాంటి అరసున్న కథ...
అమ్మాయే సన్నగా...అరనవ్వే నవ్వగా...అంటూ అందంగా పాట వ్రాసేడో సినీకవి. సంస్కృతంలోని మందహాసాలూ దరహాసాల కంటె ఈ తెలుగు అరనవ్వు చాలా బాగుందనిపిస్తుంది నాకు.అరవిందేక్షణ ముఖారవిందంలోని మధురాధరాలపై మెరుపులా మెరిసి మాయమయ్యే అరనవ్వులాంటిదే మన అరసున్న కూడా.మన భాషలో నిలువుగా వ్రాసే ఈ అరసున్నని వెల్లకిలా పడుకోబెడితే నిజంగానే అర నవ్వులాగానే ఉంటుంది కదా? మన సాహితీ గగనంలో మెరుపులా మెరిసి మాయమైన అరసున్న కథేఁవిటో తెలుసుకుందాం.అయితే ముందుగా నిండుసున్న పుట్టి ఆ తర్వాతనే అరసున్న వెలిసింది కనుక ఈ కథ నిండు సున్న కథతోనే ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇంతకు ముందు కొంగలూ..మేఁకలూ..సున్నలూ..అరసున్నలూ అనే పోస్టులో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్ది వరకూ మన తెలుగు భాష లో నిండు సున్న కూడా కనిపించదని చెప్పాను కదా.అప్పటి వరకూ ఈ నిండు సున్న పలకాల్సిన చోట్లల్లా  మన కచటతప వర్గాల్లోని అనునాసికాలనే వ్రాసేవారని తెలుసుకున్నాము.ఉదా హరణకి పండు అని వ్రాయాల్సిన చోట పణ్డు అని వ్రాసేవారన్న మాట. క్రమేపీ  అనునాసికాల స్థానంలో అనుస్వారాల్ని వ్రాయడం ఆరంభమయింది. అనుస్వారమంటే నిండు సున్నాయే.అచ్చు లేకుండా దానికి ఉనికే లేదు కనుక దానిని అనుస్వారం అన్నారు.అయితే ఇది ఒక్కసారిగా ఇప్పటి నిండుసున్న రూపాన్ని సంతరించుకోలేదు.మొదట్లో దీనిని పలకవలసిన చోట అక్షరం మీద ఒక చుక్కలాగా వ్రాసేవారు. అంటే పం అని వ్రాయాల్సిని చోట  ప మీద చుక్క పెట్టే వారన్నమాట. ఈ చుక్కనే సంస్కృతాభిమానులైన మనవ్యాకరణ పండితులు బిందువు అన్నారు. అందుకే ఇప్పుడు మనం దాన్ని నిండుసున్నలా వ్రాస్తున్నా కూడా దానిని వారు బిందువనే వ్యవహరిస్తున్నారు.  కుండ,మంద లాంటి పదాల లోని డకార ద కారాల్ని బిందుపూర్వక డకారమనీ దకారమనీ అనడానకి కారణమిదే.కొన్నాళ్లకి వ్రాతలో ఈ చుక్క సరిగా కనిపించదనేమో దానిచుట్టూ సున్నలా చుట్టడం ప్రారంభించేరు.అప్పుడది తలకట్టు లేని ఠకారంలా ఉండేదన్నమాట.కాల క్రమంలో అక్షరం మీద వ్రాసే ఈ అనుస్వారాన్ని అక్షరం ప్రక్కను వ్రాయడం ఆరంభించేరు.కొన్నాళ్లకు లోపలి చుక్క పోయి చుట్టూ ఉన్న సున్న మాత్రం మిగిలింది. ఇలా అనునాసికంతో ప్రారంభమై అనుస్వారం వ్రాయడమనేది కొద్దిగా అటూ ఇటూగా నన్నయ కాలానికే పూర్తయింది.ఇదీ మన నిండుసున్న రూపుదిద్దుకున్న వృత్తాంతం.అయితే అనునాసికం వ్రాసినా అనుస్వారం వ్రాసినా కూడా కొన్ని కొన్ని చోట్ల దానిని పూర్తిగా ఒత్తి పలకడం గాని తేల్చి పలకడంగాని ఉంటూనే ఉండేది.అలా పూర్తిగా ఒత్తి పలికిన చోట అది పూర్ణానుస్వారం. తేల్చిపలికిన చోట అది అర్థానుస్వారం అన్నమాట.ఎలా పలికినా వ్రాతలో దానిని నిండుసున్నగానే వ్రాసేవారు.సున్నను పూర్తిగా ఒత్తి పలికితే దాని ముందున్న అక్షరం గురువవుతుంది.లేకపోతే అది లఘువవుతుంది కదా? రెండు సంజ్ఞలకీ నిండు సున్ననే వ్రాస్తే ఏది ఎలా పలకాలో ఏది గురువో ఏది లఘువో తెలుసుకోవడం ఎలాగ? అందుకని సున్నని పూర్తిగా పలకాల్సిన చోటుల్లో దాని తర్వాత వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరంగా వ్రాసే వారు. ఉదాహరణకి పండు లో సున్నపూర్తిగా పలకాలి కనుక పండ్డు అని వ్రాసివారన్నమాట. అలాగే మూండు అనే చోట డకారం ద్విత్వాక్షరంగా వ్రాయలేదు కనుక మధ్యలో సున్నా ఉన్నా దానిని మూఁడు అని తేల్చి పలకాలన్నమాట.ఇలాగ ఎక్కడ నిండు సున్నగా పలకాలో ఎక్కడ అర సున్నగా పలకాలో నిశ్చయమయిపోయినా మనకి అచ్చు యంత్రాలు వచ్చే వరకూ పైన చెప్పిన పధ్ధతే కొనసాగింది.మన తాళ పత్ర గ్రంథాలలో కూడా  ఈ పధ్ధతే కనుపిస్తుంది.శిథిలం కాకుండా ఉన్నఏ తాళ పత్ర గ్రంథాలలో నయినా ఇప్పటి అర సున్న రూపం ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు. అందుచేత మనకు అచ్చుయంత్రాలతో పాటే ఈ అరసున్న ఇప్పటి రూపంలో ఆవిర్భవించిందని చెప్పాలి.అంటే దాదాపు రెండువందల ఏళ్ల క్రిందట ఇది లేదు. ఇప్పటికో యాభై ఏళ్లు పైనే అయింది ఇది మన వ్రాతల్లో కూడా కనుమరుగైపోయి. అచ్చుకి నోచుకున్న మన పాత ప్రబంధాలూ కావ్యాలూ సాహిత్యశాస్త్ర గ్రంథాల్లో తప్ప మరెక్కడా ఇప్పుడు కనిపించదు.అమ్మాయి వదనంలో ఇలా మెరిసి అలా మాయమైన అరనవ్వులాగా ఈ అరసున్న కూడా మన తెలుగు సాహితీ గగనంలో ఇలా మెరిసి అలా మాయమైంది. పూర్వం అనుస్వారం ఉండే చోట్ల దానికి జ్ఞాపకచిహ్నంగా మన కావ్యాల్లో మాత్రం ఇది మిగిలి పోయింది.

                                                                              



                                                                              



24, మార్చి 2013, ఆదివారం

కొంగలూ..మేఁకలూ..నిండు సున్నలూ..అరసున్నలూ..


               కొంగలూ..మేఁకలూ...నిండుసున్నలూ..అరసున్నలూ..
నేను బాగా చిన్నప్పుడు, అంటే అక్షరాలూ గుణింతాలూ నేర్చుకునే వయసులో వేసవి సెలవుల్లో మా యింట్లో పిల్లల అల్లరి భరించలేక మా పెద్దవాళ్లు మా పిల్లలందరినీ మా యింటికి నాలుగిళ్ల తర్వాత ఉన్న యింట్లో పిల్లలకి పాఠాలు చెప్పే కాంభుక్త మేష్టారు గారింటికి చదువు నేర్చుకోమని తోలే వారు, ఆ విధంగా నైనా ఓ గంట సేపు మా అల్లరి తప్పుతుందేమోనని.ఆ విధంగా చాలా చిన్నప్పుడు వారి దగ్గర కొద్ది రోజులు చదువుకోవడానికి వెళ్లడం తప్పిస్తే నేనెప్పుడూ ప్రయివేటుకి వెళ్లలేదు. ఈ రోజుల్లో ట్యూషను చెప్పించుకోవడాన్ని ఆ రోజుల్లో ప్రయివేటు  అనేవారు. ముళ్లపూడి ఈ ప్రయివేటు అన్నదానికి వేరే అర్ధం చెప్పడం వేరేకథ.ఇలా నేను కాంభొట్ల వారి దగ్గర గుణింతాలు నేర్చుకుంటున్న రోజుల్లో వారి దగ్గర ప్రయివేటు చదువుకుంటూ ఉండేవారిలో ఒకబ్బాయి మా అందరికంటే ఒకటి రెండేళ్లు పెద్ద వాడో ఏమో గాని చాలా పొడుగ్గా కొంగ లాగా ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా మాతో పాటే గుణింతాలు నేర్చుకుంటూ ఉండేవాడు. అసలు విషయమేమిటంటే, ఆ అబ్బాయి ఎప్పుడు పుస్తకం తీసి చదవమన్నా కొంగ అనే పదాన్ని కొజ్ఞ్ జ్ఞ్ గ అనే చదివే వాడు. మా వేసవి సెలవులూ ప్రయివేట్లూ అయిపోయాయి కానీ మేం అక్కడ ఉన్నన్నాళ్లూ కాంభొట్ల వారు ఎంత ప్రయత్నించినా ఆ కొజ్ఞ్ జ్ఞ్గ బాబు చేత కొంగ అనిపించ లేక పోయారు.
                                                        ***
ఈ కథ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే..వచ్చింది మరి.ఇప్పుడంటే మనం కొంగ అని మధ్యలో పూర్ణానుస్వారం  అనబడే నిండు సున్నతో వ్రాసి కొమ్.. మ్.. గ అనేటట్లు పలుకు తున్నాము గానీ, మన తెలుగు భాష పూర్తిగా స్థిర పడని తొలి రోజుల్లో దాదాపు క్రీ.శ. నాలుగో శతాబ్దం వరకూ తెలుగు భాషలో ఈ అనుస్వారం లేదు. అందు చేత ఆ ధ్వని పలుక వలసిన పదాలన్నిటిలోనూ అక్కడ అనునాసికాన్నే వాడేవారు. అనునాసికమంటే మన కచటతప వర్గాల్లో వర్గపు చివరి అక్షరాలన్నమాట. ఉదాహరణకి, పంకజము అనే మాటని అప్పుడు పజ్ఞ్కజము అని వ్రాసేవారన్నమాట. త వర్గంలో చివరి అక్షరం న.అందుచేత కాంత అనే పదాన్ని కాన్త అని వ్రాసేవారు.  పండుని  పణ్డు అని వ్రాసేవారు.  ఇలాగే అన్నీ. మరి అనునాసికమనే పదమే చెబుతుంది అది ముక్కుతో పలికే ధ్వని అని. మరి అలా టప్పుడు కొంగ ని కొజ్ఞ్ గ అనే వ్రాసి ముక్కుతో అలాగే పలికే వారన్న మాట. మరి మన కొంగ బాబు ఆ రోజుల్లో పుట్టి ఉంటే అతడి ఉచ్చారణని ఎవరూ తప్పు పట్టేవారు కారన్నమాటే కదా?  
                                                       ***
కొంగ అనే పదంలో నిండుసున్న అలాగే ఉండగా, మేఁక అనే పదంలో నిండుసున్న లేదు గానీ అరసున్న కనిపిస్తుంది.దీని గురించి కొచెం వివరంగా చెప్పాల్సి ఉంది. ఇంతకు ముందు తన పేరు మరచి పోయిన ఈఁగ కథ అనే పోస్టులో ఈగని మొదట్లో ఈజ్ఞ్గ అనీ .. ఆ తర్వాత ఈంగ అనీ తరువాత ఈఁగ అనీ ప్రస్తుతం అరసున్న కూడా విడచి పెట్టి ఈగ అని అంటున్నామనీ వ్రాసేను.ఇది  చదివిన బ్లాగ్మిత్రులొకరు చిన్నయ సూరి తన బాల వ్యాకరణము లో దీర్ఘము మీద సాధ్య పూర్ణ బిందువు రాదన్నాడనీ అందు చేత ఈఁగ ఎప్పటికీ ఈంగ కానేరదనీ వ్రాసేరు.చిన్నయ సూరి చెప్పినది నిజమే. ఆయన చాలా అర్వాచీనుడు. ఆయనకు ముందే ఎన్నో శతాబ్దాలకు పూర్వమే దీర్ఘము మీది పూర్ణానుస్వారాన్ని తేల్చి పలకడంతో అది మాయమై పోయి దాని స్థానంలో దాని గుర్తుగా అరసున్న మిగిలింది. అంతే గాని  దీర్ఘము మీద పూర్ణ బిందువు  ఎన్నడూ  లేదనడం సమంజసం కాదు.దీనికి ఉదాహరణగా కూతురనే అర్థంలో కూంతు అనే శిలా శాసన ప్రయోగమూ, వీడు అనే అర్థంలో నన్నెచోడుడు వాడిన వీండు అనే ప్రయోగమూ శ్రీ బూదరాజు వారు చూపించారు. పదాది   వర్ణము పయినే ఊనిక యుండి యది గురువగుటవలనను ప్రక్కనున్న యనుస్వారము పయిని ఊనిక పూర్తిగా బ్రష్టమగుటను, దీర్ఘము పయినుండిన యనుస్వారము సార్వత్రికముగా బ్రష్టమయినదిఅని తేల్చి చేప్పారు శ్రీ గంటి జోగి సోమయాజి గారు.అందు వలన ఈఁగ మొదటి రూపము ఈంగ అనీ,  దక్షిణాది తెలుగు వారు దానిని ఇప్పటికీ అలాగే ఉచ్చరిస్తారనీ  శ్రీ తిరుమల రామచంద్ర గారు చెప్పిన దానిని మనం అంగీకరించవలసే వస్తుంది. నా ఈఁగ కథ పోస్టులో చెప్పని విషయం ఒకటుంది. ఈఁగలు అనే బహువచన రూపమే మొదట వచ్చి దానినుంచి ఈగ అనే ఏక వచన రూపం వచ్చిందంటారు శ్రీ సోమయాజి గారు. అదెలాగంటే ఈజ్ఞ్ అనే మూల ద్రావిడ శబ్దానికి ఆ భాషలోని బహువచన ప్రత్యయమైన కళ్ అనేది చేరి ఈజ్ఞ్+కళ్ ఈంకళ్ ఈంగళ్ ఈంగలు అయిందనీ, మన తెలుగు భాషలో లు బహువచన ప్రత్యయంగా స్థిరపడిన తర్వాత ఈంగలు లోని లు ని మాత్రమే బహువచన ప్రత్యమనుకొని దానిని విడచి పెట్టి ఈంగ అనే ఏక వచన రూపం  అనుచిత విభాగం వలన ఏర్పడ్డదనీ సోమయాజిగారు తెలిపారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే-
 ఈఁగలు లాగే మేఁకలు అనే బహువచన రూపమే మొదట ఏర్పడి దానినుండి మేఁక అనే ఏక వచన రూపం ఏర్పడి ఉండి ఉండ వచ్చునని నా కనిపించడమే.ఈఁగలు ఈజ్ఞ్..అని శబ్దం చేయడం వల్ల వాటికి  ఈగలు అని పేరు వచ్చినట్లే మేజ్ఞ్..మేజ్ఞ్.. అని అరిచే వాటికి మేజ్ఞ్+కళ్ మేంకళ్ మేంకలు అని పేరు వచ్చి ఉండవచ్చును.
ఈఁగలు లో లాగానే మేంకలు లోని దీర్ఘము మీది పూర్ణానుస్వారము మీద ఊనిక తగ్గించి పలకడంతో మేఁకలు అయి ఉండవచ్చును. అయితే  మూల ద్రావిడ భాషలో ఏ రూపం ఉండేదో నాకు తెలియదు కనుక  మేఁకలు ఈగలు లాగే అనుచిత విభాగం వల్ల ఏర్పడిందో కాదో నిర్ధారించలేను. అది ఏ రకంగా ఏర్పడినా ముందు మేంకలు అనే రూపం ఉండేదనీ, దాని నుంచే మేఁకలు  అనే రూపం ఏర్పడి ఉంటుందనడానికి  మేఁకలు లోని అర్థానుస్వారమే సాక్ష్యం. కొంగలూ  మేఁకలూ లో నిండు సున్న అరసున్నల కథ ఇది. ఈ నిండు సున్న అరసున్నల గురించి చెప్పుకోవలసిన విశేషాలు మరికొన్ని ఉన్నాయి. అవి మరోసారి చెప్పుకుందాం.సెలవు.

11, మార్చి 2013, సోమవారం

తనపేరు మర్చి పోయిన ఈగ కథ...


                                  .
మీరెప్పుడైనా విన్నారో లేదో కానీ, నా చిన్నప్పుడు మా పెద్దలు చెప్పగా విన్నానీ కధ.
అనగనగా ఒక ఊళ్లో ఉండే ఒక ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ ఉండగా తన పేరు మర్చిపోయిందట.ఈగేఁవిటి? ఇల్లలకడఁవేఁవిటి? అని అప్పుడు నేనడగలేదనుకోండి. అడిగినా వాళ్లు చెప్పేవారు కాదు. వెధవా కథకు కాళ్లేఁవిటి ముంతకు చెవులేఁవిటి అంటూ ఎదురు దాడికి దిగే వారు. కథకు కాళ్లు లేకపోతే  ముందుకెలా వెళ్తుందండీ చివరకు కంచికెలా వెళ్తుందండీ అయినా ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తే కథ చెప్పడం మానేస్తారని నోరుమూసుకుని చెవులు చేటలు చేసుకుని వినేవాణ్ణి. అలా ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిన ఈగకు ఎంత తల బద్దలు కొట్టుకున్నా తన పేరు గుర్తుకు రాలేదట.అయినా తలలు బద్దలు కొట్టుకుంటే ఏవైనా గుర్తుకు వస్తాయటండీ?  అలా వస్తాయంటే నేనెన్నిసార్లు తల బద్దలు కొట్టుకోవలసి వచ్చేదో. మరపు మానవ సహజం కదా అని ఊరుకుంటాను. మరపు మానవ సహజమే కాదు ఈగలకు కూడా సహజమే అన్నమాట.అయినా పెళ్లాం పుట్టినరోజో, ఎవరికో తీర్చాల్సిన అప్పో అయితే హాయిగా మరచిపోయి ఊరుకోగలం కాని మన పేరే మనకి గుర్తు లేకపోతే ఎలా చావడం. అందుకని ఆ ఈగ అయ్యలారా తల్లులారా అన్నలారా అక్కలారా నా పేరేమిటని రోదిస్తూ కనిపించిన వాళ్లందరినీ అడిగిందట. దాని భాష అర్థంకాకో, ఇంత చిన్న ప్రాణి అడిగితే మనం జవాబు చెప్పాలా అనే అహంకారంతోనో మనషులెవ్వరూ దానికి సమాధానం ఇవ్వలేదట. ఆ తర్వాత కనిపించిన జంతువులనన్నిటినీ—కుక్కనీ పిల్లినీ ఆవునీ అన్నిటినీ అడిగందట. ఏ వీ దానికి జవాబు చెప్పలేదు.ఆఖరుగా దానికి నిద్ర పోతున్న ఒక గుఱ్ఱం కనిపించిందట. చివరి ప్రయత్నంగా దానినీ అడిగింది. జవాబు లేదట. దానికి సరిగా వినపించలేదేమో అని దాని చెవిలో దూరి రొద చేసి మరీ అడిగిందట. ఈ ఈగ చెవిలో చేసిన రొదకి  గుఱ్ఱం ఒక్కసారిగా నిద్ర లేచి చెవులు విదిలిస్తూ  హిఁహిఁహిఁ.ఈఁ ఈఁ.. ఈఁ.. అంటూగట్టిగా సకిలించిందట. అది విన్న ఈగకు వెంటనే తన పేరు ఈ..గ. . అని గుర్తుకు వచ్చి మనసు తేలికై ఈల వేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ చక్కగా ఎగిరి పోయిందట. ఈగ లెక్కడైనా ఈల వేస్తాయా? డాన్స్ చేస్తాయా? అని నన్నడగకండి. ఈగలు ఈలలూ వేస్తాయి డాన్సులూ చేస్తాయి లవ్వూ ఆడతాయి. విలన్ల మీద ప్రతీకారాలూ తీర్చుకుంటాయి. కావాలంటే రాజమౌళినడగండి.
                                                                 ****
ఇంతవరకూ మా పెద్దలు చెప్పిన కథ. మిగిలింది నేను చెబుతాను వినండి.
ఈ ఈగ అసలు పేరు ఈజ్ఞ్ గ. ఈజ్ఞ్.జ్ఞ్..జ్ఞ్.. అంటూశబ్దం చేస్తుంది కనుక దానిని ఈజ్ఞ్గ అన్నారు. అదే ఈంగ అయింది.ఇప్పటికీ దక్షిణ దేశంలో ఉన్న మన తెలుగు వారు ఈంగ అనే పిలుస్తారు.మథ్యలో ఉండే పూర్ణానుస్వారాన్ని తేలిగ్గా పలకడమో  అసలు పలకక పోవడమో జరుగుతూ అది  నేటికి ఈగ అయింది.ఒకప్పుడు దానిని ఈంగ అని పలికే వారమని గుర్తుగా ఈఁగ అంటూ మధ్యలో అరసున్నాతో తెలియజేస్తారు.ఈ అరసున్నలు నా చిన్నప్పుడు ఉండేవి. కాని ఇప్పుడు ఎవరూ వ్రాయడంలేదు కనుక ఈంగ అనే దాని పూర్వపు నామం ఇప్పటివారికి తెలీదు.ఇలాగే చిన్నగా ఉండి ఎగురుతూ ఉండే వాటిని మన వాళ్లు ఈగలనే అనేవారు.జోరుగా రొదచేస్తూ తిరిగేది జోరీగ.వాటిల్లో కాస్త బొద్దుగా ఉండేది బొద్దు + ఈంగ = బొద్దీంగ ..బొద్దీంగ..బొద్దింక అయ్యింది.. బొద్దింకలో మనకు నిండు సున్నా నేటికీ కనిపిస్తూ ఉంటే, ఈగలో అది మాయమయింది. ఇలా వచ్చిన సున్నలూ అరసున్నలూ అవి మాయమై పోవడాల గురించి మరోసారి చెప్పుకుందాం. సెలవా మరి?


4, మార్చి 2013, సోమవారం

పద్యం పురి విప్పి నాట్యమాడిన ఊరు...


                             
                                                ఓ  పదిహేను పదహారు సంవత్సరాలకు పూర్వం నేను రిటైరు కాకముందు ఉద్యోగ రీత్యా కృష్ణా జిల్లా లోని నూజివీడు వెళ్లాను. అక్కడ రోడ్లు భవనాలు శాఖ ఇంజనీరు వారి కార్యాలయంలో పద్దులు తనిఖీ చేస్తుండగా వారు  నిర్మాణం పూర్తిగావించిన ఒక వంతెన ఖర్చుల వివరాలు చూస్తుండగా ఆ ఇంజనీరు గారు మీరో సారి ఆ వంతెన చూడాలి బాగుంటుంది అని అన్నారు.ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా నేను ఆ వంతెనను చూడాల్సి లేకపోయినా, వారి కోరిక మేరకు ఒక ఆదివారం వారు తీసుకు వెళ్లగా దానిని చూడడానికి వెళ్లాను. ఆ వంతెన ఇటు కృష్ణా జిల్లాను అటు ఖమ్మం జిల్లానూ కలుపుతోంది. ఇప్పుడు సరిగా గుర్తు లేదు కాని ఆ నది పేరు వైరా అనుకుంటాను. ఇటువైపు ఆ వంతెన మొదలయ్యే ఊరు కృష్ణా జిల్లాలోని  ఒక చాలా చిన్నగ్రామం. ఇప్పుడది పెరిగిందో ఏమో మరి? అప్పుడా చిన్నగ్రామంలో ఒక చిన్న దేవాలయం. దానిలో కొలువై ఉన్నాడు శిఖి పింఛమౌళి. ఆ చిన్ని కృష్ణుని దర్శించుకుని  తిరిగి వస్తూ దారిలో మరో చోట వెంకటేశ్వరుని కూడా  సేవించుకుని  తిరిగి మా కార్యస్థానాన్ని చేరుకున్నాను. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ ఊరికి సంబంధించిన విశేషం ఒకటి నా చెవిన బడి అప్పటి నా జ్ఞాపకాల్ని తట్టి లేపింది.  ఆ విశేషం కొంచెం విన్న వించుకుంటాను.
                                                            ..... 
                                                         దాదాపు ఇప్పటికి నలభై ఏళ్ళక్రితం ఆ ఊళ్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాథ్యాయులు ఉండేవారు.చాలీ చాలని సంపాదనే అయినా గుట్టుగా కాలక్షేపం చేసుకుంటూ నెట్టుకొచ్చేవారు. ఆయన తన పిల్లలను  ఒళ్లో కూర్చో పెట్టుకుని  అమర కోశం వురాణనామ సంగ్రహం వంటి గ్రంథాలనూ అనేక పద్యాలనూ వారిచేత వల్లె వేయించేవారు. ఆ విధంగా వారికి అక్షరాలు నేర్వకమునుపే అనేకమైన పద్యాలూ అవీ కంఠస్థమయేవి.వారి పిల్లలలో ఒక అబ్బాయి మరీ చురుకైన వాడు.అతడిని వారింటికి వచ్చిన మేనమామలూ ఇతర బంధువులూ  ఏదిరా అబ్బాయి ఒక రూపాయి ఇస్తాం పద్యం చదువరా అంటే గళగ్రాహిగా చదివేసేవాడు. వారు మురిసిపోతూ మరిన్ని పద్యాలు చదివించుకుని డబ్బులయిపోతూ ఉంటే అర్థ రూపాయి, పావలా ఇస్తా నన్నా ఆ అబ్బాయి వారికి కావలసినన్ని పద్యాలు అప్పజెప్పే వాడు. అసలా ఊరిలోనే పిల్లలందరికీ అనేకమైన పద్యాలు కంఠతా వచ్చేవట.తండ్రి గొప్ప పండితుడైనా కుటుంబభారం వహించడానికి పడే కష్టాలు  ఆ బుడుతడి మనస్సుకును కష్టం కలిగించి అతడిలో ఎలాగైనా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలనే పట్టుదలని పెంచాయి.ఆ విధంగానే అతడు కష్టపడి చదివి   పెద్దయ్యాక  I.A.S. Officer  అయాడు.అయితే ఇలా పేద కుటుంబంనుంచి వచ్చి పెద్ద పెద్ద పదవులనలంకరించిన వారు  కొందరైనా లేకపోలేదు కనుక మరీ ఆశ్చర్యపడిపోవలసిన అవసరం లేదు. కానీ ఈ బుడుతడి విషయం వేరు. కసితో చదివి I.A.S  సాధించినా తనకు ప్రాణ ప్రదమైన సాహిత్యోపాసన మాన లేదు. చిన్న నాడే మొదలు పెట్టి పెద్దయ్యే సరికి దాదాపు వెయ్యికి పైగా అవధానాలు చేసాడు. 18 కవితాసంకలనాలను ప్రచురించాడు. . పాతిక వేలకు పైగా పద్యాలు వ్రాసేడు. అవధాన విద్య  దాని పుట్టు పూర్వోత్తరాలు.. అనే సిధ్దాంత గ్రంథం వ్రాసి డాక్టరేటు సంపాదించాడు. ఈయన ప్రస్తుతం మన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు గా వ్యవహరిస్తున్నారు. ఇంత చెప్పేక మీకే అర్థమై పోయి ఉంటుంది. ఈ శేముషీ ఖని పేరు రాళ్లబండి కవితా ప్రసాద్. ఈ మధ్యనే జాలంలో భక్తి టీవీలో వచ్చిందని చెప్పి ఆయనతో ఇంటర్వ్యూ ఒకటి పెట్టారు.అందులో ఆయన అనేకమైన విషయాలు చెప్పారు. తన చిన్నప్పటి ముచ్చట ఇలా చెప్పినదే. తనకే కాదు తమ ఊళ్లో పిల్లలందరికీ చాలా పద్యాలు కంఠతా వచ్చి ఉండేవని చెప్పారు.అందుకే ఆ వూళ్లో పద్యం పురివిప్పి నాట్యమాడిందన్నాను. ఇంతకీ ఆ ఊరి పేరు చెప్పనే లేదు కదూ?  ఆ ఊరి పేరు నెమలి. నేను వంతెన చూసే మిషతో  బాల శిఖి పింఛమౌళిని దర్శిం చుకు వచ్చిన ఊరూ అదే..నెమలి.
                                                     ......
కష్టపడి I.A.S  సాధించిన వారూ ఉన్నారు. అలాగే శతావధానాలూ, సహస్రావధానాలూ చేసిన ధీ మణులూ ఉన్నారు. అయితే రెండిటినీ సాధించినా  తనకు  I.A.S. ఆఫీసరుగా ఉండడం కంటె ఉపాధ్యాయునిగా ఉండడమే ఇష్టమని చెప్పిన ఆయనను అబినందిస్తున్నాను. ఈ కాలంలో తెలుగు సాహిత్యం చదువుకుంటే  తమ పిల్లలు I.A.S. లాంటివి సాధించ లేరేమోననే భయంతో పిల్లలను  తెలుగు సాహిత్యానికి దూరం చేసే తల్లదండ్రులకు కనువిప్పు కావాలన్నదే ఈ వ్యాసోద్దేశం.
                                                 ....
సెలవు.                                                                                         4.03.2013

14, జనవరి 2013, సోమవారం

సృష్టి లో తీయనిది....



కన్యాశుల్కం నాటకంలో గిరీశం వెంకటేశాన్ని చదువు చెప్పే మిషతో సృష్టిలో ఏమేమి వస్తువులు ఉన్నవో చెప్పమని అడిగితే దానికి తడుముకోకుండా చెగోడీలు అని ఠక్కున సమాధానమిస్తాడు వెంకటేశం.దానికి గురువు గారి ఇంగితం గ్రహించి విధవలు అని వెంకటేశం సమాధానమిస్తే,  విధవా వివాహాల గురించి పెద్ద లెక్చరు దంచాలని గిరీశం ఆశ.ఎవరి ఇష్టాలు వారివి. ఎవరి గోల వారిది.
అలాగే సృష్టిలో తీయనిది ఏది అని మనం ప్రశ్నిస్తే తడుముకోకుండా ప్రేమ  అని సమాధానమిస్తాడు ప్రేమికుడు. ప్రేమికులు ఊసుపోక కబుర్లు చెప్పుకున్నా అవి తియ్యగానే ఉంటాయి. అవి “Sweet Nothings”.
అలాగే వారు కనే కలలు కూడా తియ్యగానే ఉంటాయి.  అవి “Sweet Dreams”.
 రాజకీయుడు పదవి అంటాడు.లుబ్ధుడు ధనం అంటాడు.కన్నతల్లి నా సంతానం అంటుంది.
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నది ఒక  కవిగారి ఉవాచ. మనం సృష్టిలో తియ్యగా ఉండేదేదో చెప్పమంటుంటే అందరూ వారి వారి కిష్టమైన వస్తువుల పేర్లు చెబుతున్నారేంటి అనుకో వద్దు. అదంతే. ఆఖరుకి కొత్తావయ కాయో మిర్చిబజ్జీలో అంటే ప్రాణం పెట్టే ఆసామీలు కూడా తన ప్రాణమంటే తనకు తీపి అనే అంటారు కాని కారం అని అనరు కదా?అలా మన యిష్టాలకి తీపి పర్యాయపదమైపోయింది.
ఎవరైనా మనకు శుభ వార్త మోసుకుని వస్తే చల్లగా తీపి కబురు చెప్పావు కదయ్యా అంటూ అతడి నోట్లో ఇంత పంచదార పోయడమో బెల్లం ముక్క పెట్టడమో చేసేవారు మన పూర్వ కాలపు ఇల్లాళ్లు.ఏదో ఒకటైనా తీపివంట చేసుకోకపోతే మనకు పండుగా వెళ్లదు, శుభకార్యమూ జరుగదు కదా.ఇలా మనం కష్టపడి చేసుకునే తీపివంటల సంగతలా ఉంచితే, ప్రకృతి సిధ్ధం గా దొరికే తియ్యటి పండ్లు, చెరుకు, పాలమీగడా, తేనె వంటివి ఉండనే ఉన్నాయి. పండ్లూ చెరుకుల్లో రసం మాత్రమే తియ్యగా ఉంటుంది.పాలను కాస్తేనే కాని మీగడ కట్టదు.కాని తేనె ప్రతిబొట్టూ మధురమే.పాపం ఎన్నో వందల తేనెటీగలు ఎన్నో వేల పుష్పాలనుంచి ఎంతో దూరాలనుంచి మకరందాన్ని సేకరించి తమ గూట్లో పెట్టుకుంటే మనం అనాయాసంగా దానిని సంగ్రహిస్తాము.ప్రకృతి  సిధ్ధమైన వాటిల్లో తేనె అత్యంత మధురమైనదే కాకుండా ఆరోగ్య హేతువుకూడా అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ తేనె పట్టుల్లో లభించే తేనెగురించి అందరికీ తెలిసిందే కాని దానికన్నభిన్నమైనదీ, మధురమైనదీ, చాలామందికి తెలిసి ఉండనిదీ, అన్ని చోట్లా లభ్యం కానిదీ అయిన మరో తేనె గురించి మీకు చెప్పాలన్నదే నా కోరిక. వినండిమరి.
మన తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి తూర్పుగా ఆరు కోసుల దూరంలో తూర్పుగా ఉండే పొన్నాడ,తొండంగి, వేమవరం గ్రామాలను ఆనుకుని, వాటికీ తూర్పు సముద్రానికీ మధ్యలో పలచటి అడవి ప్రాంతం కొంత ఉంది. కోన అనే వారు దాన్ని. ఈ కోన లో పాల చెట్లనే చెట్లు ఉంటాయి..వీటి తొర్రలను గూళ్లు చేసుకుని మన తేనెటీగల్లాంటి చిన్న ఈగలు వాటిల్లో గుడ్లు పెట్టుకుంటూ కాపురముంటాయి. అలాగే ఈ కోనలో సన్నగానూ పొడుగ్గానూ ఉంటూ, జమ్మి ఆకులను పోలిన ఆకులతో ఉండే చిన్ని చెట్లు ఉంటాయి. ఈ చిన్ని చెట్లకు చిన్ని చిన్ని తెల్లని పువ్వులుంటాయి.ఆ తేనె టీగలు  చిన్ని చెట్ల పువ్వులనుండి తేనె గ్రహించి తమ గూళ్లలో పెట్టుకుంటాయి. అదే కాక  ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వరి పంట సేద్యమయ్యే కాలంలో వరి చేలు ఈనుతూ ఉండే సమయంలో వరి పువ్వారు అనే వరి పువ్వు ఉంటుంది. ఆ తేనెటీగలు చిన్ని పువ్వుల తేనెతో పాటు  వరిపువ్వారునూ సంగ్రహించి తమ గూళ్ళకు చేరుస్తాయి.తమ గుడ్లు ఎదిగి అవి పిల్లలయే సరికి వాటి ఆహారం కోసం.అయితే  ఈ తేనె మన మామూలు తేనె లాగా ఎర్రగానూ ఉండదు, ద్రవరూపంలోనూ ఉండదు.  తెల్లగా చిన్న చిన్న పలుకుల్లాగా ఉండి గడ్డకడుతుంది.ఒకొక్క గడ్డా శేరు, శేరున్నర వరకూ తూగుతుంది.ఇది అత్యంత మధురంగా ఉంటుంది. దానికోసం  అక్కడే అడవిలో పాకలు వేసుకుని కాపురముంటూ పిఠాపురం రాజావారి సేవకులు ఆ తేనె తయ్యారయ్యే సమయం చూసుకుని దానిని సంగ్రహించి రాజా వారికి చేర్చే వారు. వారు దానిని తమ ఇష్టులకీ ఆప్తులకీ ఇచ్చుకుని మిగిలినది తమ వాడుక కోసం ఉంచుకునే వారు.ఈ తేనె సంవత్సరం లో రెండుసార్లు తయారవుతుంది.అయితే ఆషాడ మాసంలోతయేరయ్యే తేనె వరిపువ్వారు ఉండదు కనుక , కార్తీక మాసంలో వరిపువ్వారుతో కూడా కలసి తయారయ్యే  తేనెలాగా అంత మధురంగా ఉండదు.కార్తీక మాసంలో తయ్యారయ్యే ఈ చిన్ని పువ్వుతేనె తియ్యదనానికి దానికదే సాటి.ఇది నడి వేసవిలోచిన్నమెత్తు స్వీకరించినా తాపాన్ని హరించి చలవ చేస్తుందట.
ఈ తియ్యటి తేనె దాని సేకరణ గురించి బ్రౌను లోకలు రికార్డులలో ఉంది. మరి ఇప్పుడు ఇది దొరుకుతోందో లేదో ఆ జిల్లా వారెవరైనా చెప్పాలి.
సంక్రాంతి పండుగ పూటా మీతో తియ్యటి కబుర్లు చెప్పుకోవాలనిపించింది. అందుకే అపురూపమైన ఈ చిన్ని పువ్వు తేనెగురించి వ్రాసేను.బ్లాగ్మిత్రులకు సంక్రాంతి శుభకామనలతో—సెలవు.