21, జూన్ 2013, శుక్రవారం

ఈ బంధం ఏనాటిదో?


ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా.. అన్నారు మన పెద్దలు. ఈ ఋణం ఈ జన్మలోదో ఇంతకు ముందరి ఏ జన్మ లోదో కూడా మనకు తెలియదు. మనం ఏ జన్మలోనో చేసుకున్న పాప పుణ్యాల ఫలితం గానే  ఈ జన్మలో మనకు  భార్యా బిడ్డలు కానీ ఇల్లూ వాకిలి గానీ పశు సంపద కానీ ఒనగూరుతాయన్నది దీని  తాత్పర్యం. పూర్వకాలంలో పశువులనే సంపద గా భావించిన రోజులలో చెప్పినది కనుక పశు పత్నీ సుతాలయా అని మాత్రమే అన్నా, దీని విస్తృతార్థం ఏమిటంటే మనకు లభించే సమస్త సంపదలూ స్నేహితులూ ఇరుగూ పొరుగూ బంధు వర్గం పరిచయస్తులూ పని మనుషులూ..ఒకటేమిటి సమస్తమూ ఈ ఋణానుబంధ రూపేణా మాత్రమే ఏర్పడతాయని. ఈ విషయాన్ని తేటపరిచే ఈ కథ చదవండి.
                                                                             ***
గుజరాత్ లోని అహ్మదాబాదు నగరంలో నివసిస్తున్న నిరంజన్ భగత్ గారికి ఇప్పుడు 88 ఏళ్ళు. ఇతడు
ఆజన్మబ్రహ్మచారి. స్వతహాగా కవి. స్థితిమంతుడు. దయార్ద్ర హృదయుడన్నూ. దాదాపు 30 సంత్సరాల క్రితం ఈయన ఇంట్లో పనిచేసే పనిమనిషి ద్వారా ఆమె ఊరికి చెందిన ఓ 8 ఏళ్ళ కుర్రాడు ఊళ్లో తిండికి గడవక ఈయన ఇంటికి వచ్చి చేరాడు. తనకు చేతనైనంత పని చేస్తూ భగత్ గారి అభిమానాన్ని చూరగొన్నాడు.భగత్ గారు కూడా ఈ అబ్బాయి- పేరు జగత్- ని పని వాడుగా కాకుండా ఇంట్లో మనిషి గానూ- ఇంకా చెప్పాలంటే తన స్వంత కొడుకు లాగే చూసుకున్నాడు. వారి ఈ బంధం బాగా గట్టి పడే సందర్బం 2000 సంవత్సరం లో తటస్థించింది. అప్పుడు భగత్ గారి తల్లి గారికి విపరీతమైన జబ్బు చేసి మరణ శయ్యమీద ఉంటే  ఆమెకు జగత్ చేసిన సేవ ఏ పని మనిషి గాని ఆఖరుకు కన్న కొడుకు గాని చేసి ఉండరంటాడు భగత్ గారు. ఈ విధంగా జగత్ తన యజమాని కుటుంబానికి మరచిపోలేని సేవ చేస్తుంటే, భగత్ గారు మాత్రం తక్కువ తిన లేదు. జగత్ పిల్లలిద్దరూ-15 ఏళ్ళ అమర్, 11 ఏళ్ల జయధీర్ లకు చదువు చెప్పించాడు. జగత్ కి తన స్వంత ఊరు దుంగార్ పూర్ లో ఉన్న స్వంత ఇల్లు బాగు చేయించు కోవడానికి తగిన ఆర్థిక సహాయం చేసాడు. తమ అమ్మ గారికి జగత్ చేసిన సేవ మరచిపోలేని భగత్, జగత్ కోసం ఏమైనా చేస్తానంటారు. అనడమే కాదు ఆయన జగత్ పై చూపించే ప్రేమాభిమానా లెటువంటి వంటే వేసవి కాలంలో జగత్ కుటుంబం అహ్మదాబాదులో గడపడానికి వచ్చి నప్పుడు తన ఫ్లాట్ లోని ఏర్ కండిషన్డ్ మాస్టర్ బెడ్ రూమ్ ని ఖాళీ చేసి వారిని వాడుకోమంటారు.

88 ఏళ్ళ భగత్ తాను నూరేళ్ళు బ్రతకాల్సి వచ్చినా నిశ్చింతగా బ్రతుకుతానని తనని చూసుకోవడానికి కొడుకు కంటె ఎక్కువైన జగత్ ఉన్నాడన్నదే తన ధైర్యమని అంటారు.

 తమ కెంత సంపదలున్నా-నలుగురు కొడుకులున్నా వారందరూ కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాకూడా –తమ జీవిత చరమాంకం ఎట్లా గడుస్తుందో నని సతతం దిగులు చెందుతూ బిక్కు బిక్కుమంటూ జీవితాలు గడిపే వృధ్ధ జంటలు లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ రోజుల్లో పై మాటలనగలిగే దైర్యం ఎవరికుంది?
అయితే ఈ కథకు కొస మేరుపేమిటంటే- కవిగారు- శ్రీ నిరంజన్ భగత్ గారు  తన యావదాస్తి నీ- అంటే అహ్మదాబాద్ లోని శ్రీ మంతుల పేట లోని కోటి రూపాయలకు పైగా విలువ జేసే తన ప్లాట్ నీ, 9 లక్షల రూపాయల బాంక్ డిపాజిట్లనీ- ఇంకా ఇన్స్యూరెన్స్ పాలసీలనూ తనతదనంతరం జగత్ కి చెందేటట్లు వీలునామా వ్రాసేరట. ఆయనకు ఇద్దరు మేనల్లుళ్లున్నాసరే.

వీరి ఈ బంధానికి మూలం ఏ జన్మ లోదో ?


ఈ కథలో మనం తప్పక గమనించాల్సిన మరొక కోణం- యజమానులూ పనివారల సంబంధం ఎలా ఉండాలన్నది.మరీ ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసేవారి విషయంలో మనవైఖరి ఎలా ఉండాలన్నది ప్రతి స్త్రీ గమనించాలి. మనం ఏదో వెయ్యి రూపాయలిస్తున్నాం కదా ఏ నాగాలు పెట్టకుండా పని చెయ్యవచ్చు కదా అనే అమ్మలే ఎక్కువ మంది. నిజానికి మనమిచ్చే డబ్బులు రోజూ వాళ్లయింటినుండి మన యింటికి రావడానికయ్యే బస్ ఛార్జీలకు కూడా సరిపోవు.వారికి గడవక వేరే పనులు చేతకాక మన యిళ్ళలో పని చేస్తుండవచ్చు.మన ఆర్థిక పరిస్థితుల బట్టి వారికి మనం ఎక్కువ ఇవ్వలేక పోయినా వారి కష్టం సుఖం గమనిస్తూ తోటి మనుష్యులకివ్వాల్సిన గౌరవాన్ని వారికిస్తూ మన గౌరవాన్ని నిలుపుకుందాం. సెలవు.

ఈ కథనానికి మూలం నేటి- 21 జూన్ -  టైమ్స్  దిన పత్రిక లోని వ్యాసం.  పత్రిక వారికి కృతజ్ఞతలు.    

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

ఏ పేగు ఎక్కడ ఎందుకు ఎలా కదులుతుందో చెప్పలేం. పని వాళ్ళనూ మనుషులుగా చూసే సంస్కారం ఇంకా మన వాళ్ళలో చాలా మందికి అలవడ లేదు. శ్రమ విలువను కొలిచే కొల బద్దలు మనకింకా దొరక లేదు.