15, సెప్టెంబర్ 2011, గురువారం

శ్రీవిశ్వనాథ రామప్పంతులు


లౌక్యం అనే పదానికి మన నిఘంటువులిచ్చే అర్థం ప్రపంచ సంబంధమైనది..మనుష్య సంబంధమైనది.. సర్వ సామాన్యమైనది.. వాడుకలోనున్నది..  అని.. .. కానీ మనం ఈనాడు ఏదైనా ఇబ్బందికరమైన సందర్భంలో ప్రదర్శించే దాటవేత  వైఖరిని లౌక్యం అంటున్నాము  పూర్వం కన్యాశుల్కం రచనాకాలానికి  సామాన్య లౌకిక జీవితం గడిపేవారిని  లౌక్యులనే  వ్యవహరించినా లౌక్యం అనే  పదాన్ని దాదాపు ఇప్పుడున్న అర్థంలోనే  వాడేవారనిపిస్తుంది..
 కన్యాశుల్కం  ( చతుర్థాంకం..1 వ స్థలం) లో లుబ్దావధాన్లు పెళ్లి కుదిర్చాక    పెద్దిపాలెం  వెళ్లి లౌక్యుల్ని ఎవరు పిలవడం? ” అంటాడు రామప్పపంతులు. ఇక్కడ మనకు నైఘంటికార్థమే కన పడుతుంది. కానీ కన్యాశుల్కం  (ద్వితీయాకం  1వ స్థలం)  లోని మధురవాణి.రామప్పపంతుళ్ల సంభాషణ లో ఆనాటికే  ఈ పదం సంతరించుకున్న ప్రత్యేకార్థం  గోచరిస్తుంది. మధురవాణి సుబ్బిజాతకం కూడా రామప్పపంతులు బనాయింపేనా అని అడిగినప్పుడు అది అగ్నిహోత్రావధాన్లే బనాయించేడనీ ఆనాటి బ్రాహ్మలలో అది మామూలేననీ అంటాడు..మధురవాణి దాన్ని పచ్చిమోసంగా పేర్కొంటే రామప్పపంతులు కాదు దాన్ని లౌక్యం.. లౌక్యం..అనమంటాడు. రెండిటికీ భేదమేమిటని ప్రశ్నిస్తే నమ్మించోట చేస్తే మోసమనీ.. నమ్మంచోటచేస్తే లౌక్యమనీ విశదీకరిస్తాడు. ఈ సంభాషణకి చక్కని  ముక్తాయింపునిస్తూ తాను         చేస్తే లౌక్యం. మరోడు చేస్తే మోసం అనరాదా అంటుంది.   ఆ సీనులోనే మరోచోట లౌక్యమంటే మరేవిటనుకున్నావు ? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడమనీ చెప్తూ తాను మోసపు  మాటలతో లుబ్దావధాన్లని పెళ్లికిఎలా ఒప్పించిందీ వివరిస్తాడు.
 దానా దీనా మనకు తేలేదేమిటంటే .. లౌక్యం అనే దాంట్లో  కించిత్తు మోసం కూడా అప్పుడప్పుడూ ఉండొచ్చుననీ కనీసం నిజాయితీ లోపించవచ్చుననీ. కన్యాశుల్కం సంగతి కాసేపు ప్రక్కని పెట్టి ఉపనిషత్కారుడేమన్నాడో చూద్దాం.    సత్యం బ్రూయాత్.. ప్రియంబ్రూయత్.. సత్య.మప్రియం నబ్రూయాత్ అనికదూ?”.ఏమీ?తెలిసినా నిజం చెప్పకూడదా?.. ఎందుచేత? అవతల వాళ్లని నొప్పిస్తామేమోనని ఎందుకొచ్చిన గొడవ అనేకదా?  ఇది లౌక్యానికి నిర్వచనంకాదా?.  ఇదీ వదిలేయండి. సుమతీ శతక కర్త ఏమన్నాడో చూడండి:
ఎప్పటికెయ్యది ప్రస్తుత 
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ! 
అని. ఇది పక్కా లౌక్యం కాదా ?  పద్యంలో యతిని కాసేపు మరచిపోతే ధన్యుడు అనేచోట  లౌక్యుడు అనేది ఎం త చక్కగా సరిపోతుందో  ? అయితే ఎలాంటి వారికయినా చాలా సందర్భాల్లో   గోడమీది పిల్లి ”  ఆదర్శవంతమౌతుంటుంది.   Play it safe ..అన్నది  cat on the wall philosophy.

  సరదాగా ఇక్కడ ఓ ముచ్చట చెప్పబుధ్ధౌతోంది.   196667 ప్రాంతంలో నేను ఏజీ ఏఆఫీసులో పని చేసే రోజుల్లో  చాలా సాహితీ సభలు జరుగుతూ ఉండేవి. ఒకసారి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారూ.. మరో ప్రసిధ్ధ కవి పండితుడూ  సాయంత్రం సభజేస్తారని తెలిసింది.  ఎక్కువ మంది రారేమో ననే జంకుతో మీటింగ్ క్లబ్బు హాలులోనే ఏర్పాటు చేసారు.మామూ లుగా అయితే లాకాయి లూకాయి సభలకి  విశ్వనాధ వారు రారు.. అయితే అప్పట్సో ఆయన గవర్నమెటు సర్వీసులో ఉండేవారు. గజెటెడ్ ఆఫీసరు కావడంతో వారి జీతా లన్నీ ఏ జీ ఆపీసు వారు ఆధరైజ్      చేస్తే గానీ వారికి ముట్టేవి కావు.   ఆ కారణం చేతో ఏమో ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చే వారు. ఆ రోజు మరీ అధ్వాన్నం.  సాహితీ సమితి  కార్యవర్గ సభ్యులతో కలిపినా పది పదిహేనుమందికంటే లేము.  మొదటగా ఆయనతో పాటుగా వచ్చిన కవిగారు కొంచంసేపు మాట్లాడి కూర్చు న్నారు. తర్వాత విశ్వనాధ వారు ఏం చెబుతారో నని అందరం ఆశగా ఎదురు చూసేము. ఆయన కూర్చున్న కుర్చీలోంచి లేవకుండానే ఇంగ్లీషులో ఓ కథ చెప్పి ముగించారు. తెలుగులో ఒక్కముక్క మాట్లాడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆకథ నాకు గుర్తు లేదుగానీ సారాంశం మాత్రం బాగా గుర్తుండిపోయింది.  ఆకథ  చెప్పిన వాడూ విన్నవాడూ ఫూల్స్ అని.  ఆ కథ చెప్పడంలో ఆయన ఉద్దేశం మీరెంతమంది వస్తారో నని నేను ఎదురు చూసేను. నేనేంచెప్తానో నని మీరు ఎదురు చూసి ఉంటారు. కాని ఉభయులమూ ఫూల్స్ గా మిగిలామని కావచ్చు. చూసేరా కవి  సామ్రాట్టు గారి  సమయస్ఫూర్తిన్నీ లౌక్యమున్నూ.   అన్నట్టు ఆయన వయసులో ఉండగా కన్యాశుల్కంలో రామప్పపంతులు వేషం వేసేవారట.  మరింక ఆపాటి లౌక్యం అబ్బకుండా పోతుందా?    అందరం  ఎంతోకొంత లౌక్యులమే కాదా ?

(ఇది సరదాగా వ్రాసినది.శ్రీ విశ్వనాథ వారంటే నాకెంతో గౌరవం)

సెలవు.





6 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది.
ఐతే మీరు ఏజీ ఆఫీసువారా?
చిట్టా సీతారామయ్యగారు పరిచయమా?

www.apuroopam.blogspot.com చెప్పారు...

నాకు శ్రీ సీతారామయ్యగారుతెలుసు,1960లలో ఒరిస్సా ఆఫీసు నుంచి ట్రాన్స్సఫర్ చేయించుకుని హైదరాబాదు వచ్చేరు. చాలా సౌమ్యుడు. స్నేహశీలిన్నీ. ఆ.యన తోడి మీసంబంధం గురించి తెలుపగలరు. రచయిత పంతులజోగారావు నాతమ్ముడే. కథామంజరి బ్లాగునిర్వహిస్తున్నాడు.మాఅమ్మాయి సుధారాణి ఇల్లాలి ముచ్చట్లు అనే బ్లాగు నిర్వహిస్తోంది. మీరు చూస్తున్నారా? నాబ్లాగులోని రచలలపై మీ స్పందన తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీ " లౌఖ్యం " బాగుంది .
మీరు ఏ.జి. ఆఫీసు వారా ? అయితే మీకు " కొండేపూడి సుబ్బారావు గారు " తెలుసా ?
[ ఇప్పుడు లేరు ] కదా మంజరి చూస్తూనే ఉంటాను . పంతుల జోగారావు గారు మీ తమ్ముడన్న మాట . చాలా సంతోషం. మీ పరిచయం మా అదృష్టం

www.apuroopam.blogspot.com చెప్పారు...

రాజేశ్వరిగారికి, మీ స్పందనకి కృతజ్ఞతలు.నేను రిటైరై 15 సంవత్సరాలు కావస్తోంది.సుబ్బారావుగార్లు మా ఆపీసులో చాలామంది ఉండేవారు. వారిలో ఎంతో మందితో నాకు పరిచయం కూడా ఉండేది. అయితే ఇంటి పేర్లు తెలియక పోవడంతో కొండేపూడి వారెవరోతెలియడంలేదు. ముఖం చూస్తే గుర్తు పడతాము. వారు మీకు ఏమవుతారో లేక పరిచయస్థులో తెలియజేయండి. నా కంద పద్యాలు కూడా మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు. మరికొన్ని త్వరలో పెడతాను .బ్లాగు చూస్తూ ఉండండి. సెలవు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
జవాబు వ్రాసి నందులకు కృతజ్ఞతలు. " కొండేపూడి సుబ్బారావు గారు , మా పెద్దమేనత్త గారి భర్త. మంచి కవి. వారి ప్రచురణలు అనేకం. మా పిన తండ్రి " తల్లాప్రగడ భవానీ శంకరం " గారు , ఈయన కలసి సంస్కృత అనువాదములు చేసేవారు. ఇప్పుడు ఇద్దరు లేరు. [ శివానంద లహరి, కనకధార మున్నగు నవి ] మీ పరిచయం మా జన్మ సుకృతం. మీ రచనలు చదవగల అదృష్టం కలిగి నందులకు చాలా సంతోషం. ధన్య వాదములు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

అమ్మా, మీ ఉత్తరం నాకు కలిగించిన సంతోషాన్ని వ్యక్తం చేయలేను.వ్యక్తిగత విషయాలకు ఇది సరైన స్థలం కాదు కనుక మీకు వేరే మైల్ చేస్తున్నాను.ఇక్కడ మీకు కృతజ్ఞతలు మాత్రం చెప్పుకోనివ్వండి.