8, సెప్టెంబర్ 2011, గురువారం

వెచ్చని పచ్చడం లేకపోతే పితలాటకమే



                                                         ఈ మధ్య  కళింగాంధ్ర మాండలికం..1 అనే పుస్తకం మరోసారి చదివేను. ఈ పుస్తకం 2006 జనవరిలో శ్రీకాకుళ సాహితి వారు ప్రచురించేరు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే శ్రీ జి.ఎస్.చలం గారు దీనిని వ్రాసేరు. ఏ యూనివర్శిటీయో, అకాడమీయో చేయాల్సిన పనిని  ఒక్కరూ నెత్తికెత్తుకుని చేసారు. ఆయన కృషి చాలా అభినందనీయం, భాషాభిమానులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. అయితే ఆయన వ్యవహర్తలనుంచీ,ఆ ప్రాంతపు రచయితల పుస్తకాలనుంచీ  పదాలు సేకరించి పుస్తకాలలోని మాటలకు తాననుకున్నవీ, ఆయావ్యవహర్తలు చెప్పినవీ అర్థాలు వ్రాసుకోవడంవల్ల  కొన్ని పొరపాట్లూ,తప్పుడు అర్థాలూ దొర్లేయనుకుంటాను. వాటిగురించి మరోసారి ముచ్చటిస్తాను గానీ ఇప్పుడు చెప్పబోయేది కళింగాంధ్ర మాండలికాలనడానికి వీల్లేని పదాలు  లెక్కకు మిక్కిలిగాఉన్నాయనే. ఒక మంచి కృషిని శ్లాఘించాలి కాని లోటుపాట్లు ఎత్తి చూపకూడదనే  సంస్కారంతోనేమో పుస్తకానికి ముందుమాట వ్రాసిన బూదరాజు రాధాకృష్ణ గారు కూడా ఈ విషయాలు విస్మరించారని అనుకుంటాను. ఆ ప్రాంతపు మాండలికాలనడానికి వీలు లేని పదాలకుదాహరణగా రెండు ముక్కలు మనవి చేస్తాను. చూడండి:

 పచ్చడం  --దుప్పటి  (పేజీ 90 )   అర్థం గురించి ఏ తగువూ లేదు కాని ఇది అన్ని నిఘంటువుల కెక్కిన,  ఆంధ్ర దేశం అంతా వాడుకలో ఉన్న,  కావ్యాలలో కూడా కనుపించే పదం.. సందర్భం వచ్చింది కనుక చక్కటి పద్యమొకటి
ఉటంకిస్తాను. ఇది శ్రీ వినుకొండ వల్లభరాయడు (లేక ఆయన పేరుతో శ్రీనాధమహాకవి ) వ్రాసినది అయిన క్రీడాభిరామము లోనిదని రసజ్ఞులందరికీ తెలుసు కానీ యువతరం వారికోసం:
                                  మాఘమాసంబు పులివలెమలయుచుండ
                                  పచ్చడమ్మమ్ముకొన్నాడు పణములకును
                                  పడతిచన్నులు పొగలేని ముర్మురములు
                                  చలికినొరగే.కేలుండు సైరికుండు. 
                           (భావం తెలిసినవారు తెలియనివారికి తెలియజేయగలరు)

పితలాటకం:  (పేజీ 94) దీనికి రచయిత ఇచ్చిన అర్థంఎంతకీ తెగకపోవడంఅని .దీన్ని చూస్తేనే తెలుస్తుంది రచయిత ఎవరేంచెప్తే అది వ్రాసుకున్నారని.  ధీనికి సరైన అర్థం మోసం అని ఏనిఘంటువైనా చెప్తుంది.అసలిది పిత్తల+హాటకం . పిత్తల అంటే ఇత్తడిని హాటకం అంటే బంగారం అని మోసం చేసి చూపించడం. నిఘంటువులు ఇది అరవ పదమని చెప్తాయి. ప్రముఖ భాషావేత్త వరిశోధకుడూ అయిన ఢా. చల్లా రాధాకృష్ణశర్మ గారు తన మద్రాసు తెలుగు అనే వ్యాసంలో దీనిని పేర్కొన్నారు.
   
మద్రాసులో పలికే మాట కళింగాంధ్ర మాండలికం ఎలాగవుతుంది? అందుకే బూదరాజుగారు మొహమాటపడ్డారన్నాను. నా ఈ వ్యాసోద్దేశం  శ్రీ చలంగారి కృషిని తక్కువ చేయాలని  ఎంతమాత్రం లేదని మరోసారి మనవి చేసుకుంటూ బూదరాజు వారిని  క్షమాపణలుకోరుకుంటున్నాను.  గ్రంథాలలో తప్పులు అలా ఉండిపోకూడదనే సదుద్దేశం మాత్రమే నన్నీ పనికి పురికొల్పింది.

స్వస్తి





3 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

పెద్ద పితలాటకమే

కమనీయం చెప్పారు...

గోపాలకృష్ణ గారి వ్యాఖ్యలన్నీ చదివాను .బాగున్నాయి.రైతుల పంట నష్టాన్ని,నాయకుల వాగ్దానాల గురించి రాసిన గేయం కూడా అర్థవంతంగా ఉంది.
ఇక మాండలికాల గురించి-నేను భాషాశాస్త్రవేత్తను కాను.కాని రెండు మాటలు.
1.మనం మాండలికాలనుకొన్న పదాలు తెలుగునిఘంటువులో ఉన్నాయి.ఉదా|బేపి అంటే కుక్క అని ఉత్తరాంధ్రలో వాడతారు.ఈపదం నిఘంటువులో ఉంది.అలాగే రథంకి అనంతపురంలో తేరు అంటారు .ఇది కూడా నిఘంటువులోను ,కవ్యాల్లోను ఉంది,2.నిన్నమొన్నటిదాకా కచేరీ ,ఠాణా,వంటి ఉర్దు పదాలు తెలంగాణా ప్రాంతంలోనేగాక కోస్తా ప్రాంతంలోను వాడుకలో ఉండేవి.కంగాళీ అని మిగతా ప్రంతాలలో కూడా వాడుకలో ఉంది.3.ఇంతకీ ఈ "పితలాటకం"ఒక్క కళింగాంధ్ర లోనే వాడుకలో ఉందని చెప్పలేము.నాకీ మాండలికభాష ఒక పెద్ద కంఫ్యూజన్.ఒకసారి మిత్రులు ఆచార్య దొణప్ప నాతో అన్నారు.రేడియో ,పత్రికల పుణ్యమా అని మా రాయలసీమలో కూడా కబుర్లు భొగట్టా వంటి మాటలు వాడుతున్నారని.4.అందుచేత మాండలికపదకోశాల కన్న అన్ని మండలాలలో వాడుకలో ఉన్న అన్ని పదాలతో సమగ్ర పదకోశము తయారు చేస్తే మంచిది.

www.apuroopam.blogspot.com చెప్పారు...

కమనీయంగారి స్పందనకి కృతజ్ఞతలు.ఇక మాండలికాల గురించి. వారికే కాదు ఎవరికైనా మాండిలికాల్ని గుర్తించడంలో కొంత కష్టంఉంటుంది. మనకి క్రొత్తగా కనిపంచే పదాలన్నిటినీ మనప్రాంతపు మాండలికమనుకో కూడదు.అవి ఇతరప్రాంతాల్లో వాడుకలో లేకుండా మనకి మాత్రమే ప్రత్యేకంగా ఉండేవి మాత్రమే మన మాండలీకాలవుతాయి.నవాబుల రాజ్యం శ్రీకాకుళం వరకూ విస్తరించి ఉన్న రోజులలో ఎన్నో పార్శీ ఉర్దూ పదాలు తెలుగు భాషలో చేరా.యి. వీటన్నిటినీ మనం తెలుగు పదాలే అనుకున్నంత సాధారణమైపోయాయి. వీటిగురించి మరోసారి వ్రాస్తాను. ఇక కంగాళీ అన్న పదం శ్రికాకుళం మాండలికమని నేను చెప్పలేదు. అది మన నిఘంటువులలో లేని పదం. అది ఎలా పుట్టి ఉంటుందో నా ఊహ చేప్పానంతే.అది కాదనుకుంటే ఎవరైనా సమర్థవంతంగా సరిదిద్దవచ్చు. ఇంక మద్రాసు తెలుగులో కూడా వినిపంచే, మన నిఘంటువులలో కూడా కనిపంచే పిత్తలాటకం వంటి పదాల్ని శ్రికాకుళం మాండలికం గా గుర్తించ కూడదన్నదే నా వాదన కదా ? మరికొన్ని "కబుర్లు.... భోగట్టాలు..." ముందు ముందు చెబుతాను.