13, జనవరి 2012, శుక్రవారం

రెండును నొకటియే కదా?....




ఎమెస్కో వారు ప్రచురించిన మను చరిత్ర ప్రబంధానికి పీఠికలో అనుకుంటాను,శ్రీ విశ్వనాథ వారిలా ప్రారంభిస్తారు. మనము ఆంధ్రులము,అనగా తెలుగు వారమురెండును నొకటియే అని. రెండును నొకటియే అయినచో మనమాంధ్రులము అనుట ఏల? అది వారి శైలి.
తెలుగువారము అంటే తేలికగా ఉంటుంది.ఆంధ్రులము అని ఒత్తి పలికితే లేని గంభీరత వస్తుంది. సామాన్యార్థక పదాలలో తేలిక వాటిని వదిలి పెట్టి కొంచెం క్లిష్టోచ్చారణ కలిగినవి వాడడం పండిత లక్షణం. పండితులే కాదు సామాన్యులు కూడా ఇలా చేస్తూంటారు వారి వారి పరిధిలో వారికున్న భాషా జ్ఞానాన్ని నలుగురికీ తెలియజేయాలన్న తపనతో.ఇటువంటి భాషాడంబరాన్నియెద్దేవా చేయడానికే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో గిరీశం లుబ్దావధాన్లుకి వ్రాసిన ఉత్తరంలో మీరు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను అనడానికిఅమందానంద కందళిత హృదయారవిందుడనైతినిఅనిపిస్తాడు.
 ఒకటి రెండు ముచ్చట్లు చెబుతాను.నా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా తాతగారి ఊరికి వెళ్లినప్పుడు మా దొడ్డమ్మ పిల్లలు కూడా వస్తుండే వారు.ఒక సారి మేము అన్నం తింటున్నప్పుడు మా అమ్మమ్మ ఇంకేం కలుపుకుంటావని నన్నడిగితే మరేమీ వద్దు చల్ల పోయి అన్నాను.నాకప్పుడు ఏడెనిమిదేళ్లుంటాయేమో? నాకంటే ఒక యేడాదే పెద్దవాడయిన మా అన్నయ్య (దొడ్డమ్మ కొడుకు) పగల పడి నవ్వుతూ మా మేన మామలతో చూడండి వీడు మజ్జిగని చల్ల అంటున్నాడు అని వెక్కిరించాడు.నాకప్పుడు దానిలో తప్పేమిటో బోధ పడలేదు. మాయింట్లో మా నాయనమ్మ చల్ల అనే అంటుంది.ఆవిడ వడ్డిస్తే తినే వాళ్లం మేము కూడా అలాగే అనడం నేర్చుకున్నాము. వాడికేం జవాబు చెప్పాలో నా కప్పుడైతే ఏమీ తెలియలేదు, కానీ పెద్ద వాడనయినాక తెలిసింది. చల్ల అనే పదమే తెలుగుదనం ఉట్టిపడుతూ తెలుగునాట విస్తారంగా వాడబడే అచ్చతెలుగు పదమనీ మజ్జిగ అనేది మార్జిక అనే సంస్కృత పదానికి వికృతి అనీ.మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లు ఉన్నాయట.1.తక్రం 2.ఉదశ్విత్తు
3. మధితం అనీ. తక్రం హ్యుదశ్విన్మథితం పాదాంబర్థాంబు నిర్జలం అని అమరకోశం చెబుతుంది, అంటే పావు వంతునీరుకలిపి చిలికినది తక్రం-సగానికి సగం నీళ్ళు పోసి చిలికినది.ఉదశ్విత్తు అసలే నీరు కలపకుండా చిలికినది మథితం.మథితం ఆరోగ్యానికి మంచిది కాదట.ఉదశ్విత్తు సగం నీరే కనుక రుచిగా ఉండదు.తక్రం రుచికరమూ శ్రేష్టమూను.( మజ్జిగకి పధ్నాలుగు పర్యాయ పదాలున్నాయి మన నిఘంటువుల్లో. మజ్జిగ చేసే విధానాన్ని బట్టి, దాని చిక్కదనాన్ని బట్టి,  ఇలా వేరు వేరు పేర్లతో వ్యవహరింప బడతాయని,అసలు పాలు తోడు పెట్టే విధానం ఏమిటో వివరంగా నవ్య వీక్లీ లో శ్రీ రమణ గారు ఒక సారి రాసేరు.) మన సామెతల్లో చల్లకొచ్చి ముంత దాచడమనే చక్కటి సామెత ఒకటుంది. ఏదో ఉపకారం కోరడానికి వచ్చి,రాగానే అడగడానికి మొహమాటపడి ఆ కబుర్లూ ఈ కబుర్లూ ఆడుతుంటే చల్లకొచ్చి ముంత దాస్తున్నాడంటారు. ఒక పౌరాణిక చిత్రం లో నారదుడు రాక్షసుల చేతుల్లో బాధలు పడుతున్న దేవతల్ని వెంటతీసుకొచ్చి విష్ణుమూర్తిని కాసేపు పొగిడిన తర్వాత  చల్లకొచ్చి ముంత దాచనేల అంటూ అసలు విషయానికొస్తాడు.ఆంధ్ర పత్రికలో ఈ సినిమా రివ్యూ రాస్తూ ముళ్లపూడి ఒక ఆట ఆడుకున్నాడు. నారదుల వారికి పాడిలేదా? చల్లకోసం రోజూ విష్ణుమూర్తి గారింటికి వెళ్లడం రివాజా? దానికోసం ముంత పట్టుకు వెళ్లేవాడా?  అంటూఏమేమో రాసేడు.శాఖా చంక్రమణం (చూసేరా నేనుకూడా ఎలాంటి పదం వాడేనోడొంకతిరుగుడు అని ఉండొచ్చుకదా? ఉహూఁ... నాకు చాలా తెలుగు, సంస్కృతం వచ్చని మీకు తెలియాలిగా?) కాకుండా మరో రెండు ముచ్చట్లు చెప్పి ముగిస్తాను.
మేం హైద్రాబాదు వచ్చిన కొత్తల్లో మా యింట్లో పనిచేసే నడివయసు పని మనిషిని మా ఆవిడ అవ్వా అని పిలిచేది.అదేం అలా పిలుస్తావంటే ఇక్కడ చిన్న పిల్లలయినా పని మనుషులందర్నీ అలానే పిలుస్తారని చెప్పింది. అవ్వ అనే పదం సామాన్యంగా వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలందరికీ వర్తిస్తుంది. మన భారతంలో ప్రబంధాలలో ఈ పదం అదే అర్థంలో వాడబడింది. తెలంగాణా ప్రాంతంలో ఈ పదం ఇప్పటికీ ఆ అర్థంలోనే వాడుకలో మిగిలి ఉంటే మిగిలిన ఆంధ్ర ప్రాంతంలో వయసుడిగిన స్త్రీ అనే అర్థసంకోచం పొందింది.మరో విషయం ఇక్కడ బాలికల్ని పోరి అని పిలుస్తారు. తెలంగాణేతర ప్రాంతాలలో కుమారి అని వ్యవహరిస్తారు.కానీ నేను చాలా పాతకాలపు శిలాశాశనంలో ఒక రాజకుమారి పేరు వసంతపోరి అని చదివేను.ఇప్పుడు వసంతకుమారి అని పెట్టుకున్నట్లన్నమాట. భాష అనేకానేక కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో మార్పులకు లోనవుతుంటుంది.మార్పులకి లోనుగాని రూపాలు కొన్ని ప్రాంతాల్లో అలాగే మిగిలి ఉంటాయి. ఒకే అర్ధాన్నిఇచ్చే వేరు వేరు పదాలు వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంటాయి. అందువల్ల ఏ పదం వాడిన వారినీ మనం సంస్కారహీనులనీ వారి భాషని వెక్కిరించాల్సిన పని లేదు.
 ఇక్కడ చివరిగా మరో ముచ్చట చెప్పి తీరాలి. శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఇల్లాలి ముచ్చట్లలో ఒకచోట ఇలా రాస్తారు.మగాళ్లు భోజనాలు చేస్తే ఆడాళ్లు అన్నాలు తింటారని.  తేడా ఏముంది? రెండును నొకటియే కదా?
( మహానుభావులుశ్రీ విశ్వనాథ వారి శైలిని ఓ సారి తల్చుకుందామని వారి పేరుతో మొదలెట్టాను కాని వారికీ ఈవ్యాసం లోని విషయాలకీ ఎంత మాత్రం సంబంధం లేదు.)
బ్లాగ్మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలతో..
మరికొన్ని విషయాలు మరోసారి. సెలవు.

7 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

బాగుందండీ. చక్న విషయాలు చర్చించారు.
రెండును నొకటియే కదా ? అంటే కావచ్చు. కాక పోవనూ వచ్చును. రెండూ సమానమే అయినా , ఒకటి మరింత ఎక్కువ సమానం కదా, ఎప్పుడూనూ. అవ్వ పదం కాల గతిలో అర్ధ సంకోచం చెందినా, తెలంగాణా ప్రాంతంలో మార్పు చెందకుండా ఉండడం విశేషమే. చల్ల గురించి మీరు రాసినది చాలా బాగుంది. అలాగే, పోరి గురించి కూడానూ.
ఇక, మనవాళ్ళకి కొన్ని పదాలు గాంభీర్యం కోసమో, విద్వత్ప్రకటన కోసమో లేని ఒత్తులు పెట్టి పలకడం ఓ దురలవాటని మీరు రాసినది వాస్తవం.

ఐతే, వాడు గుడ్డి వాడు అనడానికీ, వాడు అంధుడు అనడానికీ తేడా ఏమీ లేదు. రెండును నొకటే. కానీ
వీటిలో అంధుడు అని పలకడంలో కొంత సహానుభూతి, గుడ్డి వాడు అనడంలో రవంత కాఠిన్యం, నిస్సాకారం లాంటివి ఉంటాయేమోనని అనిపిస్తుంది. ఆలోచించాలి.
పురానం వారి మాటల్లో కూడా ఈ తేడాయే అన్నం తినడానికీ, భోజనం చేయడానికీ ఉందేమో.

మొత్తానికి మీ టపా సరదాగా ఉంది. అభినందనలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

కృతజ్ఞతలు. మీరు అనుమానం వెలిబుచ్చినట్టు అంధుడు అనడంలో సానుభూతి గుడ్డివాడు అనడంలో వెక్కిరింత ఏమీ ఉండవు.అవి వక్త పలికే తీరు అప్పటి ఆయన బాడీ లాంగ్వేజీనిబట్టి ఆయా వాసనలు సంతరించుకుంటాయి.అయితే కొన్ని కొన్ని పదాలకి ఉండే సూక్ష్మార్థ భేదాల్ని(nuances)కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మీ చర్చ బాగున్నది. అంధుడు, భోజనం లాంటి మాటలు ఇంకొంచెం చదువుకున్న వాళ్ళు వాడతారన్న నమ్మకంతో అవి గౌరవనీయమైనవని ఒక భావన వచ్చిందేమో. (చదువుకున్న వాళ్ళు ఇతరులను తేలిక చేసే అలవాట్లు వదలుకొని ఉంటారని......కానీ ఇప్పుడు అలా ఏమీ నమ్మలేము.)
ఈ మధ్యలో ఆడది, ఆడవాళ్ళు అనడం కొంచెం తక్కువ చేసినట్టుగానూ, స్త్రీ అనే సంస్కృత పదం వాడటమే గౌరవమని ఆడవాళ్ళూ, మగవాళ్ళూ కూడా కొందరు అనుకుంటున్నారు. రెండూ ఒకటే కదా?
మా రాయలసీమలో కూడా మేము అమ్మమ్మని, నాన్నమ్మని అవ్వ అంటాము. కానీ మా పిల్లల తరం వాళ్ళంతా అమ్మమ్మ నాన్నమ్మ అనడమే ఎక్కువ.

కమనీయం చెప్పారు...

సంక్రాంతి శుభాకాంక్షలు!తదుపరి;ప్రాంతాన్ని బట్టి ,వాడుక బట్టి భాషాభేదాలు తెలిసినవే.పండితుల భాష ఒకలాగ,సామాన్యులభాష ఒకలాగ,రాజుల యెదుట ఒకలాగ ఉంటుంది.వింతగా అనిపించినా ప్రాంతీయపదాలు అన్నీ నిఘంటువులో ఉంటాయి.ఉదా;' బేపి ,పోరి ,వంటివి.అందుకే ఎవరి యాసనీ ఎగతాళి చేయకూడదు.
ఐతే విశ్వనాథవారు రాసింది ఈ రోజుల్లో చాలా అవసరం.relevant కూడా.ఎందుకంటే,సామాన్యులే కాక పత్రికలు,టీ .వీ.లు,రచయితలు ,socalled మేధావులూ, ఆంధ్రులూ ,తెలుగు వాళ్ళూ ఒకటే అని గుర్తించలెకపోతున్నారు.ఆంధ్రులు అంటే తీరప్రాంతం వాళ్ళే అనే దురభిప్రాయంతో ఈ ప్రబుద్ధులు దాన్నే ప్రజలమీద రుద్దుతున్నారు.అదీ నేటి దుస్థితి !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
చాలా మంచి విషయాలు చెప్పారు. ఒకే అర్ధాన్ని ఇచ్చే పదాలు , కొన్ని కటువుగా ఉంటాయి. ఉదాహరణకి " ఆమెకు పాపం వినబడదు , అనడానికీ , ఆవిడకు చెము డండీ " అనడానికీ , ఎంతో తేడా ఉంది . అలాగే ఆయనకీ కనబడదు ,అనడానికీ , గుడ్డి వాడండీ , అనడానికీ , కటువుగా ఉంటుంది. కొందరి మనస్తత్వం అల్లాంటిది .
ఆ రోజుల్లో " పురాణం వారి ఇల్లాలి ముచ్చట్ల " లొ నావి హాస్య రచనలు చాలా ప్రచు రించారు. ఒకసారి అటువంటి మహానీయుల్ని గుర్తు చేసి నందులకు ధన్య వాదములు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

మందాకినిగారికీ, కమనీయంగారికీ, రాజేశ్వరిగారికీ కృతజ్ఞతలు.పదాలు సమానార్థకాలే అయినా వాడుకలో అవి వేరు వేరు అర్థాలు సంతరించుకోవడం ఉంటుంది.ఈ తేడాలు మనం వాటికి ఆపాదించుకునే అర్థాన్ని బట్టి ఉంటాయి.అంతే.మిత్రులు వికలాంగుల ప్రస్తావన తెచ్చారు కనుక ఒక విషయం చెప్పదలచుకున్నాను.మనలో చాలా మందికి వీరి పట్ల సరైన సానుభూతి లేదనిపిస్తుంది. పల్లెటూళ్లలో నేటికీ ఒరే కుంటోడా మూగోడా గుడ్డోడా అని పిలవడాలు ఉన్నాయి.ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో విదేశీయులే నయమనిపిస్తుంది. వారిని special children అనీ specially gifted persons అనీ వ్యవహరిస్తున్నారిప్పుడు. మనకీ సంస్కారం ఎప్పటికబ్బుతుందో?

Meraj Fathima చెప్పారు...

సర్, మీ వంటి గోప్పవారితో చర్చ జరిపే అంతటి తెలివి నాకు లేదు కానీ .. మాండలీకాలలో ఎక్కువగా వికృతులే వాడబడతాయి కదా అవి తప్పులు కావు. కానీ చాలా చోట్ల అవి తప్పులుగా పరిగణింప బడతాయి. అయితే కొన్ని చోట్ల ప్రకృతి పదం కన్నా వికృతి పదమే ఎక్కువ వాడబడతుంది. కొన్ని తెలుగే కాదు అయినా మనకు చాలా దగ్గరగా ఉండిపోయాయి. ఉదా: ఇల్లు, చెట్ట్టు వగైరా. సర్ మీ పోస్ట్ చాలా బాగుంది.