18, మే 2012, శుక్రవారం

నేనూ.. మా మధురవాణీ.. మా విశాఖ పట్నఁవున్నూ...


                       


కన్యాశుల్కం నాటకంలో ఒకానొక సందర్భంలో  కరటక శాస్త్రులు  మధురవాణి అంటూ ఒక వేశ్యా శిఖామణి యీ కళింగ రాజ్యంలో వుండక పోతే, భగవంతుడి సృష్టికి యంత లోపం వచ్చి వుండును? ”. అంటాడు.  .నిజఁవే. కళింగ రాజ్యానికి సాహితీ లోకం లో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన విదుషీ మణి  ( పాత్ర )  వేరొక్కటి లేదు. తనని  సృష్టించిన  గురజాడ మహాకవినే అబ్బురపరచేటట్లు రూపు దిద్దుకున్న పాత్ర మధురవాణి. నాటకం సప్తమాంకంలో లుబ్దావధాన్లు మీద బనాయించ బడ్డ దొంగ కేసు ముడిని ఎలా విప్పాలా అని సతమతమౌతున్న సౌజన్యారావు పంతులు గారికి ఆ విషయంలో సాయం చేసి ఆయన మెప్పు వడసి బహుమతిగా భగవత్గీత పుస్తకాన్ని అందుకుని కృతార్థురాలను అంటూ సెలవు తీసుకుంటుంది. అంతే ఆమె ఇక మరి మనకు కన్పించదు. ఇది జరిగింది విశాఖ పట్నంలోనే. మధుర వాణి (పాత్ర) చిరంజీవి కనుక  విశాఖ సాగర తీరంలోనే నడయాడుతూఉందేమో?
                                                           ***
కళింగ రాజ్యానికి మధుర వాణి  అనే ఒక వేశ్యా శిఖామణి  ఇంత పేరు సంపాదించి పెడితే, ఆ కళింగ రాజ్యంలో  ఒక నగరమణి  గా వెలుగుతున్న నగరం  మా  విశాఖ పట్నం. ఈ విశాఖ పట్నం లేక పోతే  అప్పటి కళింగ రాజ్యంలోని భాగమైన  ఇప్పటి మా ఉత్తరాంధ్ర కే కాదు, యావత్తు ఆంధ్ర దేశానికే తీరని లోటని వేరే చెప్పాల్సిన పని లేదు. తూర్పు తీరంలో  ఆంధ్ర దేశంలో వెలసిన అతి సుందరమైన నగరం ఇది. ఈ విశాఖ పట్నానికి  మనకు తెలిసి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ముందుగా ఈ ఊరికా పేరు ఎలా వచ్చిందో తెలుసుకుని  తరువాత చరిత్రలో అక్కడ జరిగిన సంగతులూ ఇతర విశేషాలూ తెలుసుకుందాము.
                                                           ***
 విశాఖ పట్నానికి ఆ పేరెలా వచ్చిందో చెబుతూ Gazetteer of  the Vizagapatam District , చాలా కాలం క్రితం ఒక ఆంధ్ర రాజు   కాశీ వెళుతూ దారి లో ఇక్కడ మజిలీ చేసాడనీ ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశుడై ఈ తీరంలో వైశాఖేశ్వరు (కార్తికేయు )డికి ఇప్పటి Lawsons Bay కి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో ఒక ఆలయం నిర్మించాడని  అంటుంది. ఈ విషయంలో ఇంకా స్పష్టంగా వివరాలను అందజేసిన కళింగ రాజ్య చరిత్ర  కులోత్తుంగ చోళ దేవ చక్రవర్తి( కీ.శ.1070-1119) , గంగ వంశపు రాజన అనంత వర్మ కళింగ రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు దండెత్తి వచ్చి ఈ ప్రాంతాన్ని లోబరచుకుని, సింహాచలమునకు నాలుగు క్రోసుల దూరములో ఈ విశాఖేశ్వరమూర్తిని ప్రతిష్టించి నట్లు చెబుతోంది. కొంత కాలం పాటు ఈ ఊరు కులోత్తుంగ చోళ పట్టణ మని కూడా పిలువ బడేదట. ఈ విధంగా వెలసిన  విశాఖేశ్వరుని పేరు మీదుగా ఇక్కడ ఏర్పడిన పట్టణానికి  విశాఖ పట్టణమనే పేరొచ్చింది. ధీనినే       17 వశతాబ్దపు  పూర్వార్థంలో ఇక్కడికి చేరుకున్న  ఇంగ్లీషు వారు సంక్షిప్తీకరించి వైజాక్ అనీ వైజాగ్ అనీ పిలువనారంభించేరు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర వాసులు దీనిని వైజాగ్ అనే ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పట్టణానికి ఈ పేరు తెచ్చిన విశాఖేశ్వరునితో పాటు ఆయన ఆలయమూ  కాల గర్భంలో సముద్రంలో కలిసి పోయింది. 1750 ప్రాంతంలో తయారు చేయబడిన ఈ ప్రాంతపు మ్యాపును చూస్తే   విశాఖేశ్వరుని ఆలయం సముద్ర తీరానికి  సుమారు ఒక మైలు దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంత దూరంలో ఉన్న విశాఖేశ్వరుని ఆలయం  శాశ్వతంగాములిగి పోయిందంటే   సముద్రంలో వచ్చిన పెను ఉప్పెనయే కారణమై ఉండాలి. ఇప్పటికీ  ఆ ఆలయం ఉండే తీర ప్రాంతాన్ని తీర్థపు రాళ్లని  పిలుచుకుంటూ  పర్వ దినాల్లో ఇక్కడి ప్రజలు సముద్ర స్నానాలు చేస్తుండడం విశేషమే.  ఈ ప్రాంతం ఇప్పటికీ  Lawsons bay  అని పిలవబడే ప్రాంతానికి దక్షిణాన ఉంది.
విశాఖ పట్టణానికి ఆ పేరెలా వచ్చిందో తెలుసు కున్నాం. ఆ ప్రాంతపు చరిత్ర టూకీ గా  చెప్పి , అక్కడి విశేషాలూ నా అనుభవాలూ తర్వాత చెబుతాను.
ఈ ప్రాంతం కళింగ రాజ్యంలో ఉంది కనుక, కళింగ దేశాన్ని పాలించిన గాంగ వంశపు రాజులు, తరువాత గజపతుల పాలనలో 16వ శతాబ్ది ఉత్తరార్థం వరకూ ఉంది. ఈ లోగా 1515 ప్రాంతంలో శ్రీ కృష్ణ దేవరాయలు తన జైత్ర యాత్రలో ప్రతాప రుద్ర గజపతిని ఓడించినా అతడు సంధి చేసుకోవడంతో పొట్నూరులో విజయస్తంభాన్ని నాటించి  వెళ్లిపోయాడు గాని  ప్రాంతాన్ని పాలించలేదు.. ఆ తరవాత 1568 లో ఈ ప్రాంతం గోల్కండ  ముసల్మాన్ ప్రభువుల వశమైంది. గోల్కొండ పాలకులు ఢిల్లీ మొగల్ చక్రవర్తులకు సామంతులే అయినా వారికి విధేయులై వర్తించే వారు కారు. గోల్కొండ రాజులు ఈ ప్రాంతాన్ని తమ ఫౌజుదారుల ని నియమించుకుని వారి ద్వారా పరిపాలన కొనసాగించేవారు. ఆవిధంగా నాటి  గంజాం ,విశాఖ పట్నం ప్రాంతాలు అప్పుడు  శిఖాకోల్ (అని పిలువబడే  నేటి శ్రీకాకుళం) ఫౌజుదారు అధీనంలో ఉండేవి. అప్పటి ఫౌజుదారైన షేరుమహమ్మదుతో పాటు వచ్చిన వారే విజయనగరం బొబ్బిలి సంస్థానాధీశుల పూర్వీకులు. ( ఈ షేర్ మహమ్మదు పేరిట ఇప్పటికీ షేర్ మహమ్మదు పురం అనే ఊరు శ్రికాకుళం జిల్లాలో ఉంది.) ఈ ఫౌజుదారులు కూడా స్వయంగా కాకుండా జమీందారుల ద్వారా పరిపాలన కొన సాగించేవారు. ఆవిధంగా విశాఖ ప్ర్తాంతం విజయనగరం జమీందారుల ఏలుబడిలో ఉండేది. 1748 లో దక్కను సుబేదారు మరణంతో కలిగిన వారసత్వ పోరులో బ్రిటిషు వారు ప్రెంచివారు ప్రత్యర్థులను బలపరచగా ఫ్రెంచివారు బలపరచిన సలాబత్ జంగ్ సుబేదారు అయ్యాడు. అందుకు కృతజ్ఞతగా  సలాబత్ జంగ్ 1753 లో ఫ్రెంచి వారికి ఉత్తర కోస్తా లోని నాలుగు పరగణాలనీ  ఇచ్చివేసాడు.. కాని అక్కడి ఫౌజుదారు అధికారాన్ని అప్పగించడానికి ఇష్ట పడక పోవడంతో  కొన్ని ఇబ్బందులనెదుర్కున్నా ఫ్రెంచి జనరల్ బుస్సీ  స్వయంగా వచ్చి 1757 లో ఈ ప్రాంతాల్ని స్వాధీన పరచుకున్నాడు.  ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా 1765లో  మొఘల్ చక్రవర్తి  బ్రిటిష్ కంపెనీ ప్రతినిధి యైన క్లైవ్ కి  అయిదు ఉత్తర పరగణాలనీ ధారాదత్తం చేసేడు. ఈ విధంగా 1765 నుంచి 1947లో మనకు స్వతంత్రం వచ్చే వరకూ  ఈ ప్రాంతం బ్రిటిషు వారి అధీనంలో ఉండేది. అయితే బ్రిటిషు కంపెనీ విశాఖ పట్నంలో నివాసం ఏర్పరచుకోవడం మాత్రం అంతకు చాలా కాలం ముందే  1682 లోనే జరిగింది. ఆ వైనం కొంచం టూకీగా చెబుతాను.
 1682 లో శ్రీకాకుళం ( అప్పటి చికాకోల్)   పరగణా సీర్ లస్కర్ ( ముసల్మాన్ ఫౌజుదారు ) కి ఏడాది కి  4500 రూపాయలు అద్దె చెల్లించే ఏర్పాటు మీద  బ్రిటిష్ కంపెనీ విశాఖ పట్నం ప్రాంతాన్ని కౌలుకు తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఆ మరుసటి సంవత్సరం  ఫౌజుదారుకు వెండి ట్రంకు పెట్టె,  ఖరీదైన మద్యం, 15 మణుగుల గంధపు చెక్కలు, తుపాకి మందు వంటి కొన్ని బహుమానాలనిచ్చి విశాఖ పట్టణ ప్రాంతం లో వారు ఫాక్టరీ కట్టుకునేందుకు అనుమతినీ, వారి సరుకులమీద పన్నుల మినహాయింపు వంటి అదనపు సౌకర్యాలను పొందారు. అయితే కొద్ది కాలానికే  1689 లో బ్రిటిష్ కంపెనీ వారికీ  మొగల్ ప్రభువైన ఔరంగజేబుతో పడక పోవడంతో అతడు కంపెనీ వారి ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని వారిని తన రాజ్యంనుంచి తరిమి కొట్టమని హుకుం జారీ చేసాడు.  చికాకోల్ ఫౌజ్ దార్ పంపిన  రాచవారు విశాఖ పట్నంలో ఉన్న  ఫాక్టరీలోని   బ్రిటిష్ వారిలో ముగ్గరిని చంపి మిగిలిన వారిని బందీలుగా తీసుకుని  వారి ఆస్తులను స్వాధీన పరచుకున్నారు. ఆ తరువాత 1690 లో తిరిగి ఔరంగజేబుకూ, బ్రిటిష్ వారికీ సఖ్యత చేకూరడంతో విశాఖ లోని వారి కంపెనీ ఆస్తులన్నీ తిరిగి వారి స్వాధీన మయ్యేయి.
1711 ప్రాంతం లో ముస్లిమ్ ప్రభుత్వానికి, బ్రిటిష్ కంపెనీ విశాఖ పట్నం దాని చుట్టుపక్కల గ్రామాలకు గాను చెల్లించే కౌలు సంవత్సరానికి 4862 రూపాయలు ఉండేది. దానికి బదులుగా కంపెనీ వారు ఉప్పు సారాయి తయారు చేసుకునేందుకు అనుమతీ, ఇతర సరకులు అమ్ముకునేందుకూ, సముద్రం ద్వారానూ భూ మార్గంలోనూ చేసే వ్యాపారాల మీద సుంకాలు వసూలు చేసుకునే హక్కునీ పొందేరు.
ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు తూర్పుకి తిరిగి సముద్రంలో కలిసే చోట దానికీ సముద్రానికీ మధ్య ఒక మైలున్నర పొడవు 600 గజాల వెడల్పూ ఉన్న భూ బాగంలో బ్రిటిషువారు తమ కోటని నిర్మించుకున్నారనీ దానికి దక్షిణాన చిన్నగ్రామం ఉత్తరాన 300 గజాల దూరంలోనే   పట్నమూ ఉండేవని తెలుస్తోంది. కోట ప్రాంతంలో 50 మంది బ్రిటిషర్లు నివాసం ఉండేవారు. కోట రక్షణ కోసం 150 మంది  బ్రిటిష్ వారు 300 మంది సిపాయీలు ఉండేవారట.
1753లో ఫ్రెంచివారికి నాలుగు ఉత్తర పరగణాలు ముస్లిమ్ ప్రభువులు ధారాదత్తం చేసిన సంగతి చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాంతం వారి స్వాదీనంలోకి రావడం మట్టుకు 1757 ఫ్రెంచి జనరల్ బుస్సీ స్వయంగా దండెత్తి రావడం తోనే సాధ్య      పడింది. ఈ సమయం లోనే బ్రిటిషు కంపెనీ వారి ఆస్తులను అతడు స్వాధీన పరచుకుని వారిని బందీలుగా తీసుకపోయాడు. తిరిగి 1765 లో క్లైవు మొఘల్ చక్రవర్తి నుంచి ఈ ప్రాంతాన్ని ఈనాముగా పొందడం గురించి ముందే చెప్పాను.. ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యం   వేళ్లూనుకున్నాక, తొలిసారిగా  ఈ ప్రాంతానికి విశాఖ పట్టణం  జిల్లా ముఖ్య పట్టణంగా 1769 లో అవతరించింది.
 విశాఖకి సంబంధించిన మరికొన్ని కబుర్లు విశేషాలు నా అనుభవాలూ.. మరోసారి చెబుతాను. సెలవు.
                                                                 ***


                                                                         

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఎత్తుగడ బాగుంది

కథా మంజరి చెప్పారు...

విశాఖ పట్నం అనే మహా కావ్యం ఎప్పటికయినా రాస్తానని శ్రీ.శ్రీ అనేవారు. ఆ కావ్యం రాయకుండానే మహా కవి మరణించడం కడా ఒక లోటే .

www.apuroopam.blogspot.com చెప్పారు...

ఫణీ గారికీ, పంజో గారికీ కృతజ్ఞతలు.శ్రీశ్రీ గారు
అటువంటి కావ్యం వ్రాయదలచుకుని వ్రాయకుండా పోవడం నిజంగా మన సాహితీ లోకానికి తీరని లోటే.

Rajendra Devarapalli చెప్పారు...

నేనూ విశాఖపట్నం లోనే ఉంటానండి.
విశాఖ అన్న పేరు ఎలా వచ్చింది అన్న విషయమై గణపతిరాజు అచ్యుతరామరాజు గారు
కొంత పరిశోధన జరిపారు.ఆ వివరాలు ది హిందూ పత్రికలో వచ్చాయి.
తొలిసారిగా ఈ ప్రాంతానికి విశాఖ పట్టణం జిల్లా ముఖ్య పట్టణంగా 1769 లో అవతరించింది.---అయినా ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్రాచరిత్రలో విశాఖపట్నం ప్రస్తావన లేనే లేదు సింహాచలం గురించి తప్ప ఎందువల్లంటారు?

www.apuroopam.blogspot.com చెప్పారు...

రాజేంద్ర కుమార్ గారికి, కృతజ్ఞతలు.వీరాస్వామి గారు కాశీ యాత్ర నుంచి తిరిగి వస్తున్నప్పుడు విశాఖని దర్శించుకోలేదెందుకని అడిగారు.కారణం మనమూహించుకోవలసినదే కాని నిడమేమిటో తెలియదుకదా? నీ ఊహ ఏమిటంటే ఆయన విజయనగరంనుండి అలమండ సబ్బరంరాలమీదుగా సింహాచలం చేరుకున్నాడు.పుణ్య క్షేత్ర దర్శనమే ఆయన ప్రధాన ఆశయం. విశాఖ పట్టణం 1769 లోనే జిల్లా కేంద్రంగా ఉన్నా 1830 నాటికి కూడా విశాఖ పట్టణం పెద్దగా అబివృద్ధి చెంది ఉండదు.అక్కడ ఆయన చూసి తీరాల్సిన విశేషాలేమీ అప్పటిలో లేవు.మదరాసు నుంచి వచ్చిన వాడు కనుక సాగర తీరాన్ని చూడాలనే కోరిక కూడా ఉండదు.అన్నిటి కన్నా ముఖ్యమైనది ఆ వూరు అయన దారిలో కాకుండా ఒక ప్రక్కగా
ఉండడం.రానూ పోన్ూ ఓ పాతిక మైళ్లు అనవసరమైన ప్రయాస కదా? ఇంక- 1830 లలో కాదు 1950 లలో విశాఖ పట్టణం ఎలా ఉండేదో నేనూ.. మా విశాఖ రెండో భాగంలో త్వరలోనే చదువుదురుగాని.