27, ఆగస్టు 2013, మంగళవారం

తెలంగాణా సమస్యకు పరిష్కారం ఉందా?


తెలంగాణా సమస్య జటిలమైనదే. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఎంత జటిలమైన సమస్యకైనా పరిష్కారం లేకుండా పోదు. కాకపోతే సమస్య ఎవరిదో వారే పరిష్కరించుకోవాలి. లేదా వారికి ఉభయులకీ నచ్చిన వారు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. తెలంగాణా సమస్య తెలుగు వారి సమస్య. ఈ సమస్య పరిష్కారంలో కష్టనష్టాలేమైనా వస్తే అవి మన తెలుగువారివే. అసలు సమస్యల్లా ఇది ఒక్క అధికార పార్టీదో లేక ఆ పార్టీ అధినేత్రిదో వారే నిర్ణ యం తీసుకోలేరనీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా మనం వ్యతిరేకించి పబ్బం గడుపుకోవచ్చన్న దురాలోచన పరులైన రాజకీయుల వలన వచ్చినదే. మన తెలుగు వారికి రాజనీతిజ్ఞులైన నాయకులు ఏ పార్టీలోనూ లేరు. నిష్టురమైనా ఇది పచ్చినిజం.ఇది ఏ ఒక్క పార్టీకో కాదు తెలుగు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి వర్తిస్తుంది. ఈ సమస్య మనందరిదీ కనుక ఇరువైపుల వారూ ఒకచోట కూర్చుని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే ఏదో ఒక పరిష్కారం దొరకక పోదు. స్వల్పకాలిక ప్రయోజనాలకన్నా, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారించి సమస్యకు సత్వర శాశ్వత పరిష్కారం కనుగొనడం అత్యవసరం. అయితే అసలు సమస్యల్లా  తాము నడుస్తున్నది తప్పుదారిలోనో సరైనదారిలోనో తెలియకుండా ముందుకు సాగుతున్న జనం ముందుకు తాము ఉరికి వారిని తామే నడిపిస్తున్నామనే భ్రమకలిగించే నాయకులవల్లనే. తాము సరైన మార్గాన్ని ఎంచుకుని ప్రజల్ని అటుమళ్లించగల నాయకులే మనకు లేరు. రోజూ ఎదుటివారికి సిత్త సుద్ది లేదంటూ ఆక్రోశించడమే కాని నిజమైన చిత్తశుధ్ధి గల నాయకులే మనకీనాడు కరువయ్యారు. నాయకులంటే ఎలా ఉండాలో తెలిపే ముచ్చట ఒకటి చెబుతాను వినండి.
                                               ****
1951-52 మధ్య ఒకరోజు మన పార్లమెంటు సభలో జరిగిన ముచ్చట ఇది. సభలో ఒక సభ్యుడు లేచి నిల్చొని ఒక చిన్న కోరిక అంటూ మొదలు పెట్టి  భారత ప్రభుత్వం వారు నా సంస్థకుగాని, వేరే ఇతర సంస్థకు గాని, లేక ఏదేని యూనివర్సిటీకి గాని నాలుగుకోట్ల రూపాయలు విరాళమిస్తే నేను ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రమపడి దేశాన్ని అణుశక్తిరంగంలో అభివృధ్ధి చేస్తాను అన్నాడు. ఆ సభ్యుడు శాస్త్రవేత్త అయిన మేఘ్ నాథ్ సాహా. ఆ వెంటనే మన ప్రధాన మంత్రి  నెహ్రూ గారు లేచి అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సంపాదించుకున్న మన ప్రభుత్వం ఇటువంటి ( Foolish)  పిచ్చి తలతిక్కధోరణిని హర్షించదు అని కూర్చున్నారట. నెహ్రూ గారు అన్నమాటలకి సభలో ఎవ్వరూ ఎటువంటి అభ్యంతరం తెలుపలేదట. ఆ నిశ్శబ్దం లో సభాపతి తర్వాతి అంశాన్ని ప్రకటించారట. అప్పుడు నెహ్రూ గారు మళ్లా లేచి ఐక్యరాజ్య సమితి కార్యదర్శి మన ప్రభుత్వానికో లేఖ వ్రాసేరనీ, దానిలో ప్రపంచ పంచాంగ రచనకు మనదేశం తరఫున  సారధ్యం వహించేందుకు మేఘ్ నాథ్ సాహా వంటి శాస్త్రవేత్తను పంపాల్సిందిగా కోరారనీ, దానిని  తానుసంతోషంగా బలపరుస్తూ సాహా గారి అంగీకారాన్ని కోరుతున్నాననీ అన్నారుట. కానీ ఆ మాటలు వినడానికి సాహా గారు సభలో లేరు. ఆశ్చర్యపోయిన నెహ్రూగారు సభను నడిపిస్తూ ఉండమని  సభాపతిని కోరి, తాను సాహాగారిని తోడ్కొని వస్తానని బయటకు వెళ్లి ఆయనను వెతికి తీసుకు వచ్చారట.ఆ తర్వాత నెహ్రూ గారు సభలో తన అభ్యర్థనను మరోసారి చేయగా దానికి సాహా గారు లేచిఇంతటి మహత్తరమైన దేశానికి తనవంటి మూర్ఖుడు (Fool)  ప్రాతినిధ్యం వహించడం తగదని అంటూ కూర్చున్నాడట. నెహ్రూ గారు వెంటనే లేచి తాను ఆయనను Fool  అన లేదనీ  ఆయన ప్రతిపాదనను మాత్రం  Foolish  అన్నాననీ ఆ మాట  unparliamentary కాదనీ ఒక వేళ తన వంటి పెద్ద మూర్ఖుడు  (Greater Fool)  ఆవేశంలో ఏదో అన్నా సాహా వంటి పెద్దమనిషి దానిని పట్టించుకోవడం అన్యాయం కాదా? అన్నారుట. అప్పుడు సభాపతి గా ఉన్న శ్రీ మవ్లంకర్ గారు సాహాగారూ ఇది సభాపతి అభ్యర్థన అనడమూ దానికి వెంటనే సాహాగారు లేచి తాను దానిని శిరసావహిస్తున్నాననడమూ టకటకా జరిగిపోయాయట.
                                                                   ****
ఎన్ని సార్లు సభ వెల్ లోకి వచ్చి ఎంత గొడవ సృష్టించారో,  ఎన్ని పత్రాలు చింపిపెట్టారో, ఎన్నిమైకులు విరగ గొట్టారో అన్నది తప్ప ఆ నాటి సభవంటి  సభా దృశ్యాలను గాని  అటువంటి నాయకులని గాని మనమిప్పుడు చూడగలమా?
అందరూ అటువంటి నాయకులే అయితే ఎటువంటి సమస్య అయినా దూది పింజలా తేలిపోవలసినదే కదా?
ఇప్పుడు మనకున్నది తెలంగాణా సమస్య కాదు. మనకున్న నాయకులతో వచ్చిన సమస్య. సమస్యలు రాకుండా మంచినాయకులనే ఎన్నుకుందామా?
                                                                 ****
పార్లమెంటులో జరిగిన ముచ్చటని స్వయంగా చూసి తన స్వీయ చరిత్ర విన్నంత  కన్నంత లో రికార్డు చేసినది శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారు. వారికి  నా ధన్యవాదాలు.

                                                 ****

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"పామంటి దానికి విరుగుడుంది పంతులికుండదా" గురజాడ మాట. ఉన్నవారికి సమస్య సామరస్యంగా తేల్చుకోవాలని లేదు. ఎలా చేస్తే,ఏం చేస్తే ఓట్లు పడతాయి అదే గోల అందరిదీ.

కథా మంజరి చెప్పారు...

ఇది మరీ బావుంది. ప్రజా సమస్యలు అంత సానుకూలంగానూ. సామరస్యంగానూ పరిష్కార మయి పోతే, ఇక రాజకీయ పార్టీ లెందుకు ? ప్రభుత్వాలెందుకు ?మసాలా వంటలు వండే ఛానెళ్ళెందుకు ?పుల్లట్లు పోసే పత్రిక లెందుకు ?